Homeఆంధ్రప్రదేశ్‌ఏడాదిలో ఏపీ బీజేపీకి దూకుడు నేర్పిన ‘సోము వీర్రాజు’

ఏడాదిలో ఏపీ బీజేపీకి దూకుడు నేర్పిన ‘సోము వీర్రాజు’

 

AP BJP President Somu Veerraju

ఏపీ బీజేపీకి దూకుడు నేర్పిన నాయకుడతడు.. సామాన్య కార్యకర్తల్లో ధైర్యం నింపి పార్టీని పరుగులు పెట్టిస్తున్న నేత ఇతడు.. ఏపీ బీజేపీకి ఉరకలెత్తే ఉత్సాహం నింపిన యోధుడు అతడు.. నడిపించే నాయకుడిగా ముందుండి పోరాడుతూ బీజేపీకి తగ్గు ‘సోము’డుగా నిలిచాడు.. ఆయనే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఆయన ఏడాది పాలనలో ఎన్నో పోరాటాల్లో ముందుడి నడిపించి అధికార, ప్రతిపక్షాల్లో గుబులు రేపాడు. సోము వీర్రాజు ఏడాది పాలనపై స్పెషల్ ఫోకస్..

సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్సీ వరకు ఎదిగిన సోము వీర్రాజు 40 ఏళ్లుగా బీజేపీనే నమ్ముకున్నారు. అందుకే ఆయనకు అధిష్టానం అందలం ఎక్కించింది.అక్కున చేర్చుకొని న్యాయం చేసింది. బీజేపీలో సమర్థులకు అందలం దక్కుతుందని నిరూపించింది. కేంద్రంలోని బీజేపీ ఇంత ఖచ్చితంగా.. నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకొని ఎలాంటి అలిగేషన్స్ లేని నిక్కచ్చిగా పోరాడే సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిని చేసింది. తెలంగాణలో బండి సంజయ్ వలే.. ఏపీలో సోమూ వీర్రాజు కూడా ఫైర్ బ్రాండ్. ఉన్నది ఉన్నట్టు అనే నేత. టీడీపీ కుట్రలు.. కుతంత్రాలపై నిగ్గదీసిన అడిగిన మనిషి. అందుకే సోమును అధ్యక్షుడిగా ప్రకటించగానే పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. నిజమైన కార్యకర్తకు గౌరవంగా.. గుర్తింపుగా దీన్ని అభివర్ణించారు.

*సోము వీర్రాజు ప్రస్థానం..

సోము వీర్రాజు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలోని కాతేరు గ్రామంలో 1957 అక్టోబర్ 15న సోము జన్మించారు. రాజమండ్రిలోని దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్ లో, వీటీ కాలేజీ, బీమవరం డీఎన్ఆర్ కాలేజీలో చదివారు. బాల్యంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీతో సాన్నిహిత్యంతో బీజేపీ వైపు అడుగులు వేశారు. 1978లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడయ్యాడు. 23ఏళ్ల వయసులోనే బీజేపీలోకి ప్రవేశించాడు. స్వతహాగానే ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నాడు. 1980లో రాజమండ్రి బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా.. ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడుగా పనిచేశారు.

*1987-90 వరకు యువమోర్చా కార్యదర్శిగా ఉన్నారు. 1991-94 బీజేపీ రాష్ట్రకార్యదర్శిగా చేశారు. 1996-2003 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. 2003లో రాష్ట్ర ఉపాధ్యక్షుడయ్యాడు. మళ్లీ 2006-2010 వరకు తిరిగి 2010-2013 వరకు రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పనిచేశారు. 2013 తర్వాత జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎంపికయ్యారు.

* గత చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా 2015లో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. అసెంబ్లీలో తమ వాణి గట్టిగా వినిపించడంలో సిద్ధహస్తలు. అనంతరం తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు ఆర్ఎస్ఎస్ వల్లే ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి లభించిందని అంటారు.

*నిజానికి కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ అధ్యక్షుడిగా చేసేటప్పుడు క్యాడర్ సోము వీర్రాజునే చేయాలని కోరుకుంది. కానీ కొన్ని సమీకరణాల వల్ల అప్పుడు పార్టీ కన్నాకు అధ్యక్ష పదవి కట్టబెట్టింది. సోము వీర్రాజును రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ గా చేసింది.

రాజమండ్రికి చెందిన సోము వీర్రాజు 2004లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా కడియం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీచేశారు..

పార్టీ ప్రకటించిన ఏ కార్యక్రమమైనా సరే తిరుగులేని నిబద్ధతతో అకుంఠిత దీక్షతో చేయడం.. కార్యకర్తలను నాయకులను తన మాట జవదాటకుండా నడిచేలా చూసుకోవడం వీర్రాజు సమర్థతకు నిదర్శనం.

గోదావరి జిల్లాల్లో అప్పట్లో బీజేపీ విజయభేరి వెనుక సోమువీర్రాజు వ్యూహాలు పనిచేశాయి. ఆయన గోదావరి జిల్లాల జోనల్ ఇన్ చార్జిగా ఉన్నప్పుడే కృష్ణం రాజు, ముద్రగ, వెంకటస్వామి నాయుడు, అయ్యాజీ వేమ, మాణిక్యాలరావు, ఆకుల సత్యనారాయణలను పోటీచేయించి గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. వీర్రాజు ప్రజానాడిని అంచనావేయడంలో మెరుగ్గా ఉంటారని పేరుంది. అందుకే ఈ కీలక సమయంలో వీర్రాజుకు బీజేపీ రాష్ట్ర సారథ్యం చేపట్టడం సరికొత్త చరిత్రను ఆవిష్కరిస్తుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

-ఏడాదికి పార్టీకి దూకుడు నేర్పి ఊపిరిపోశాడు
సోము వీర్రాజు ఏపీ పార్టీకి దూకుడు నేర్పారనడంలో ఎలాంటి సందేహం లేదు. ముందుగా అమరావతి రైతుల గోడును విని వారికి మద్దతుగా నిలబడ్డారు. వైసీపీని నిలదీశారు. అనంతరం తిరుమలలో అన్యమత ప్రచారంపై ఆందోళన చేశారు. తిరుమల పవిత్రత కోసం పోరుబాట పట్టారు. ఇక ఏపీలో ఆలయాల కూల్చివేతపై జనసేనతో కలిసి సోము వీర్రాజు పెద్ద యుద్ధమే చేశారు. కాలిపోయిన అంతర్వేది రథాన్ని సందర్శించి వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై పెద్ద పోరాటం చేశారు.

ఇక పోలవరం ప్రాజెక్టు జాప్యాన్ని కేంద్రంపై నిందలేస్తున్న వైసీపీ సర్కార్ ను ఇరుకునపెట్టారు. ఆ ప్రాజెక్టును సందర్శించి లెక్కలతో సహా వైసీపీ సర్కార్ చేస్తున్న మాయా మర్మాన్ని బయటపెట్టి ఇరుకునపెట్టారు. ఉత్తరాంద్ర , వైజాగ్ సమస్యలపై నిరసన తెలిపారు.

ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు, వైఫల్యాలపై ప్రతీసారి సోము వీర్రాజు పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. వైసీపీ ఇల్ల నిర్మాణం, జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై దూకుడుగా విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. తాజాగా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే ఏర్పాటు చేయతలపెట్టిన ‘టిప్పు సుల్తాన్ విగ్రహ’ ఏర్పాటుపై కూడా స్వయంగా ఆందోళనల్లో పాల్గొని బీజేపీ శ్రేణులకు కొండంత ధైర్యాన్ని నింపారు.

నాయకుడంటే కేవలం ఆదేశించడమే కాదు స్వయంగా తన బలగాన్ని నడిపించడం అని నిరూపించిన ఘనత సోము వీర్రాజుకే దక్కుతుంది. ఆయన వచ్చాకే ఏపీ బీజేపీకి ఊపు వచ్చింది.. ఊపిరివచ్చింది. పాత, కొత్త నేతలను సమన్వయం చేసుకుంటూ ఏపీ పార్టీని దిగ్విజయంగా నడిపిస్తున్న సోము వీర్రాజు లక్ష్యం చేరుకోవాలని మనసారా కోరుకుందాం..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular