Brother Anil Sharmila- Jagan: ఆంధ్రద్రేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి, ఆయన సోదరి వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మధ్య సక్యత చెడిన విషయం అందరికీ తెలిసిందే. వారి మధ్య ఏం జరిగిందో ఎవరికీ సరిగా తెలియదు కానీ.. అన్నా చెళ్లెలు ఇద్దరూ ఎడమొహం.. పెడమొహంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఆస్తుల గొడవలు ఉన్నాయని కొందరు అంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక షర్మిలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పక్కనపెట్టారని, అందుకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని మరికొందరు అంటున్నారు. కారణాలు ఏమైనప్పటికీ షర్మిల తెలంగాణాకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు. అధికారంలోకి వస్తానని బల్లగుద్ది చెబుతున్నారు. జగన్ అంటే షర్మిలకు పడదు. కరెక్టే. కానీ ఆమె భర్త బ్రదర్ అనిల్కుమార్ కు కూడా పడదా? అంటే అవుననే చెప్పుకోవాల్సి వస్తోంది. బ్రదర్ అనిల్కుమార్ తన బోధనల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శపూరితమైన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

మత బోధనలో రాజకీయ వ్యాఖ్యలు..
బ్రదర్ అనిల్ మత బోధకుడు. తాజాగా ఒక ప్రసంగంలో ‘తమ స్వార్థాల కోసం ప్రజలకు ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చే పథకాలను నమ్ముకోవద్దు’ అని హితవు పలికారు. దేవుడి పథకాలు ఇంకా గొప్పగా ఉంటాయని ఆయన అన్న మాటలకు అందరూ అవాక్కయ్యారు. సరే ఏదో దేవుడు ప్రజలకు ఏర్పరచిన ప్లాన్లు గొప్పగా ఉంటాయని అలా పోల్చారనే అనుకుందాం. అయితే ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. అనిల్ తన ప్రసంగాన్ని ముందుకు కొనసాగిస్తూ. ‘ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండుననే భావన ప్రజల్లో ఏర్పడింది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రదర్ అనిల్ ఈ వ్యాఖ్యల సమయంలో ఎక్కడా ముఖ్యమంత్రి.. పార్టీ పేరు ప్రస్తావించలేదు. కానీ, ప్రభుత్వం.. ప్రభుత్వాలు అంటూ పరోక్షంగా విమర్శలు చేశారు. గతంలోనూ విశాఖ – విజయవాడ పర్యటనల సమయంలో ఏపీ రాజకీయాలపైన బ్రదర్ అనిల్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అన్న జగన్తో సోదరి షర్మిల విభేదించి తెలంగాణలో పార్టీ ఏర్పాటు తరువాత బ్రదర్ అనిల్ ఏపీ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేయడం వారిమధ్య సఖ్యత లేదని పరోక్షంగా చెబుతున్నారు.

కొత్త పార్టీ కోసం ప్రయత్నం..
ఒక దశలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలతో ఏపీ కేంద్రంగా సమావేశమైన బ్రదర్ అనిల్ కొత్త పార్టీ దిశగా చర్చలు చేశారు. వారంతా ఎన్నికలకు ముందు వైసీపీకి మద్దతుగా నిలిచారని.. ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటు దిశాగా ఆలోచన చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వారు పార్టీ ఏర్పాటు చేస్తే తాను మద్దతు ఇస్తానని అప్పట్లోనే బ్రదర్ అనిల్ స్పష్టం చేశారు. తరువాత బ్రదర్ అనిల్ పార్టీ ఏర్పాటు ఖాయమని ప్రచారం సాగింది. కానీ, అనిల్ తాను పార్టీ ఏర్పాటు చేయటం లేదని ప్రకటించారు. ఆ తరువాత రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణుకుమార్తో బ్రదర్ అనిల్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఆ భేటీ తరువాత రాజకీయ పరిస్థితుల పైన చర్చించామని చెప్పారు. అన్ని విషయాలు త్వరలోనే తెలుస్తాయంటూ ఆసక్తి పెంచారు. మొత్తం మీద తాము జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని షర్మిల దంపతులు చెప్పకనే చెబుతున్నారు. జగన్ కూడా బావ కళ్లలో ఆనందం చూడాలని భావించడం లేదని తెలుస్తోంది.