కరోనా టెస్ట్ కిట్ ల కోసం విదేశాలపై ఆధార పడకుండా, దేశంలోనే పెద్ద ఎత్తున తయారుకు రంగం సిద్ధమవుతున్నది. మే నాటికి స్వదేశీ కిట్లు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి డా. హర్ష వర్ధన్ ప్రకటించారు. మే చివరి నాటికి లక్ష కిట్లు అందుబాటులోకి రాగలవని భావిస్తున్నారు.
చైనా నుండి దిగుమతి చేసుకున్న కిట్లు నాసిరకంవని వెల్లడి కావడంతో వాటిని వెనుకకు పంపుతున్న సందర్భంగా దేశీయంగానే వీటి ఉత్పత్తి పట్ల ప్రభుత్వం దృష్టి సారిస్తున్నది. తి త్వరలోనే భారత్ లో తయారైన ఆర్టీ – పీసీఆర్, ర్యాపిట్ టెస్ట్ కిట్లు అందుబాటులోకి రాబోతున్నాయి.
వాటి అభివృద్ధికి పలు కంపెనీలు, పరిశోధన సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు పురోగతి సాధిస్తున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆమోదంతో త్వరలోనే అవి కరోనా టెస్టు కిట్ల ఉత్పత్తి ప్రారంభించబోతున్నాయి.
అటానమస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో డాక్టర్ హర్షవర్ధన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. మే నెలలో స్వదేశీ కరోనా టెస్టు కిట్లు అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పారు.
కరోనాను గుర్తించేందుకు అత్యంత ప్రామాణికమైన ఆర్టీ – పీసీఆర్ టెస్టు కిట్స్ తో పాటు యాంటీ బాడీ ర్యాపిడ్ టెస్టు కిట్లు కూడా భారత్ లోనే తయారవబోతున్నాయని మంత్రి తెలిపారు.