రగులుతున్న జమ్మూకశ్మీర్ సమస్యను విలీనంతో చెక్ చెప్పిన మోడీ ఇప్పుడక్కడ ప్రజాస్వామ్యాన్ని విరబూయించేందుకు ఓకే చెప్పారు. జమ్మూకశ్మీర్ ను విడదీసి ఆర్టికల్ 370 రద్దు చేసి కశ్మీర్ లో రాష్ట్రపతి పాలన పెట్టిన మోడీ ఇన్నాళ్లకు జమ్మూ కశ్మీర్ నేతలతో భేటి అయ్యి వారి చిరకాల కోరిక అయిన జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్దరణకు సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.
ప్రధాని మోడీ నివాసంలో మూడు గంటల పాటు సాగిన సుధీర్ఘ సమావేశంలో జమ్మూకశ్మీర్ కు చెందిన 8 పార్టీల నుంచి 14 మంది నేతలు ఈ కీలక భేటికి హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్దరించే విషయంలో మోడీ సానుకూలంగా స్పందించారని నేతలు తెలిపారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధి గురించి నేతలు కోరిన అంశాలన్నీ మోడీ ఓపికగా విని వాటన్నింటిని నెరవేరుస్తానని తెలిపారు. కశ్మీర్ కీలక నేతలంతా ఈ భేటిలో పాల్గొనడం విశేషం.
జమ్మూకశ్మీర్ అభివృద్ధిలో ప్రధానంగా ఐదు డిమాండ్లను నేతలంతా లేవనెత్తారు. రాష్ట్ర హోదా, ప్రజాస్వామ్య పునరుద్దరణ, రాజకీయ ఖైదీల విడుదల, కశ్మీర్ పండిట్ల పునరావాసం తదితర అంశాలు నెరవేర్చాలని నేతలు మోడీని కోరారు. దీనికి మోడీ ఓకే చెప్పినట్లు తెలిసింది. ఇక రాష్ట్ర హోదా పునరుద్దరణకు కట్టుబడి ఉన్నామని హోంమంత్రి అమిత్ షా సైతం చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు మోడీ చెప్పారని కశ్మీర్ నేతలు తెలిపారు.
దీంతో జమ్మూకశ్మీర్ ను భారత్ లో విలీనం చేసిన మోడీ ఇన్నాళ్లుగా సాగిన నేతల నిర్బంధం, రాష్ట్రపతి పాలనకు తెరదించి అక్కడ ప్రజాస్వామ్య స్థాపనకు పూనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.