
మరోసారి దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అంటూ తేడాలేకుండా అందరినీ భయపెడుతోంది. కరోనా బారిన పడి అనేక రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. రోజు గడిచే సరికి వేలల్లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, పోలింగ్ ప్రక్రియ కరోనా కేసుల పెరుగుదల కారణమవుతున్నాయనే అనుమానాలు సైతం వస్తున్నాయి. కొత్తగా లక్షకు చేరువగా కరోనా కేసులు నమోదు కావడం దాని తీవ్రతకు అద్దం పడుతోంది.
ఈ పరిణామాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దేశ రాజధానిలో ఈ భేటీ ప్రస్తుతం కొనసాగుతోంది. వైద్య,ఆరోగ్య మంత్రిత్వ శాఖతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి కృషి చేస్తోన్న ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి డాక్టర్ వినోద్ పాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికారులు కొద్దిసేపటి కిందటే విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా ఒక్కరోజు వ్యవధిలో 93,249 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని.. ఈ అత్యున్నత స్థాయి సమీక్షను నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ స్థాయిలో కొత్త కేసులు పుట్టుకుని రావడం పట్ల నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. నిజానికి- ఆదివారం నాటి ఆయన షెడ్యూల్లో ఈ అత్యున్నత స్థాయి భేటీ లేదు. అయినప్పటికీ పరిస్థితి తీవ్రత అనూహ్యంగా ఉండటంతో అన్ ప్లాన్డ్గా ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ప్రధాని ఒక్కసారిగా హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేయడంపై దేశంలో ఏం జరుగుతోందోనన్న ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. ఒక్క రోజే పెద్ద సంఖ్యలో కేసులు రావడంపై రాష్ట్రాలను అలర్ట్ చేసే ఉద్దేశంతో ఈ సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు మహారాష్ట్రలోనూ పరిస్థితి అదుపు తప్పుతుండడంతో అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైనా చర్చకు రానున్నట్లు సమాచారం.