Mani Shankar Iyer
Mani Shankar Iyer: చైనా ఇండియాపై 1962 అక్టోబర్ లో దురాక్రమణకు పాల్పడిందని కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మణి శంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన నిస్సందేహంగా క్షమాపణలు చెప్పారు. ఇందులో ఎలాంటి వివాదం అవసరం లేదని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేరా జాతీయ మీడియా చానల్ అయినా ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
పవన్ ఖేరా మాట్లాడుతూ.. మణి శంకర్ అయ్యర్ మాట్లాడిన దాన్ని వివాదం చేయాలని బీజేపీ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. గాల్వాన్ లోయలో మృతి చెందిన సైనికుల మరణానికి కారణం ఎవరు. తూర్పు లడఖ్ లోని 2000 చదరపు కిలోమీటర్లలో ఉన్న 65 పాయింట్లలో 26 పాయింట్లను చైనా స్వాధీనం చేసుకుంది. అయినా చైనాకు దేశ ప్రధానమంత్రి క్లీన్ చీట్ ఇచ్చారు. 2020లో గాల్వాన్ లోయలో దేశ సైనికులు 20 మంది చనిపోయినా కూడా చైనాపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా క్లీన్ చీట్ ఇవ్వడంపై పవన్ ఖేరా మండిపడ్డారు.
చైనా ఒత్తిడికి ప్రధాని మోదీ చిత్తయ్యాడని అందుకే డ్రాగన్ కంట్రీకి క్లీన్ చీట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. మణి శంకర్ చేసిన వ్యాఖ్యలను పెద్దవిగా చూపిస్తున్నారని ఇదేమంతా పెద్ద సమస్య కాదన్నారు. బీజేపీ ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ తమ దివాలకోరుతనాన్ని చాటుకుంటుందని మండిపడ్డారు.
ప్రధాని మోదీ శత్రు దేశం అయినా చైనాకు క్లీన్ చీట్ ఇవ్వడం వెనక ఏదో రహస్యం దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలను వివాదం చేసి రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మణిశంకర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఎప్పుడో సారీ చెప్పారని దాన్ని భూతద్ధంలో చూడాల్సిన పని లేదన్నారు.