
MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం ఉచ్చు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కుమార్తె.. ఎమ్మెల్సీ కవితకు బిగుసుకుంటోంది. మొదట ఆరోపణగా మొదలైన ఈ వ్యవహారంలో ఇప్పుడు ఆధారాలు కూడా బయటకు వస్తున్నాయి. దీంతో లిక్కర్ పద్యవ్యూహంలో చిక్కుకున్న కవిత అందులో నుంచి బయట పడేందుకు వెతుక్కుంటున్న దారులన్నీ మూసుకుపోతున్నాయి. దీంతో లీగల్గా ఉచ్చులో చిక్కుకుంటున్నట్లు కనిపిస్తోంది.
ఆధారాలు కోర్టుకు..
ఇన్నాళ్లూ కవిత పేరును మాత్రమే ఎన్ఫోర్సమెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్లో చేరుస్తూ వస్తోంది. అందులో కొన్ని నిర్ధిష్టమైన ఆరోపణలు చేస్తోంది. దీంతో ఇవి రుజువు అయ్యేనా, సచ్చేనా అన్న ధీమాతో ఇన్నాళ్లూ ఉన్నారు కవిత. కానీ ఇదే కేసులో రంగంలోకి సీబీఐ కవిత ప్రమేయాన్ని నిర్ధారించేందుకు తగిన ఆధారాలు సంపాదించింది. ఈమేరకు సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది.
బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా..
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు, విజయ్నాయర్, బినోయ్బాబు, అభిషేక్ బోయి¯Œ పల్లి, శరత్ చంద్రారెడ్డి బెయిల్ కోసం సీబీఐ కోర్టులో పిటిషన్లు వేశారు. గురువారం విచారణ జరిపిన కోర్టు వాటిని తిరస్కరించింది. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన ఆరోపణలపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఈడీ సమర్పించిన కీలక సాక్షుల ఖాతాలు, ఇతర పత్రాల ఆధారంగా కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి, అతని కుమారుడు రాఘవ నిందితులతో కలిసి మొత్తం రాకెట్ను నడిపినట్లు స్పష్టంగా రుజువు చేసిందని కోర్టు తెలిపింది. ఈ కేసులో మరికొంత మంది నిందితులను ప్రశ్నించాల్సి ఉందని, మనీలాండరింగ్ను రుజువు చేయాల్సి ఉందని కోర్టు పేర్కొంది. దీంతో కవిత ప్రమేయం దాదాపు నిర్ధారణ అయింది. అరెస్ట్ కూడా ఎంతో దూరంలో లేదని తెలుస్తోంది.
కోర్టుకు ఈ ఆధారాలు..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ తమ పని తాము చేసుకుపోతున్నాయి. కుంభకోణాన్ని నిరూపించేందుకు, అరెస్ట్ తప్పుకాదని ధ్రువీకరించేందుకు తగినన్ని ఆధారాలు సేకరిస్తోంది. కానీ, ఈ స్కాంలో చిక్కుకున్నవారు ఏమీ జరుగట్లేదు అన్నట్లు మిన్నకుంటున్నారు. ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలతో సీబీఐ, ఈడీ ఏం చేస్తున్నాయో.. ఏం చేయబోతున్నాయో స్పష్టంగా అర్థమైంది. వాట్సాప్ చాట్లు, మొబైల్ లొకేషన్లు, నగదు లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లు, హోటల్ రికార్డులపై కవిత ప్రమేయం ఉందని ఈడీ తగినన్ని ఆధారాలు కోర్టు ముందు ఉంచింది. దీంతో కోర్టు కూడా నిందితులను ప్రశ్నించాల్సి ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇతర నిందితులు దినేష్ అరోరా, అరుణ్ రామచంద్రన్ పిళ్లైతో కవిత జరిపిన సమావేశాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కోర్టు గుర్తించింది. ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి కీలక నిందితుడని కూడా కోర్టు పేర్కొంది.

కోర్టు వ్యాఖ్యలతో కవిత అరెస్ట్కు ఇంకా ఎన్నో రోజులు పట్టకపోవచ్చని తెలుస్తోంది. నిందితులను విచారణ చేయాల్సిందే అని కోర్టు స్పష్టం చేయడంతో వీలైనంత త్వరగా కవిత అరెస్ట్ ఉంటుందన్న సంకేతాలు ఈడీ నుంచి వెలువడుతున్నాయి.