
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ చార్జీల పెంపు, బిల్డ్ ఏపీ పేరుతో భూముల అమ్మకంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు లో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జగన్ అనేక విధాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో విద్యుత్ శ్లాబ్లు మార్చారని, ప్రజలంతా లాక్డౌన్తో ఇళ్లలో ఉన్న సమయంలో ఇలా చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు.
వినియోగదారుల ఏడాది వినియోగం ఆధారంగా గతంలో ఏబీసీ గ్రూపులుగా విభజించారని తెలిపారు. మధ్య తరగతి ప్రజలు కూడా 225 యూనిట్లుపైగా వినియోగించాల్సి వచ్చిందన్నారు. తాము విద్యుత్ బిల్లులు పెంచలేదని ప్రభుత్వం చాలా తెలివిగా చెబుతోందని, కానీ శ్లాబ్ మార్పు కారణంగా పేద, మధ్యతరగతి వినియోగదారులు కూడా గ్రూపు సిలోకి మారిపోయారన్నారు. దీంతో గతంలో కంటే రెండు, మూడు రెట్లు బిల్లులు పెరిగాయని కన్నా పేర్కొన్నారు. తనకు కూడా మార్చి నెలలో రూ. 11,541 చెల్లించినట్లు చెప్పుకొచ్చారు. ఈ నెలలో బిల్లు రూ.20 వేలు దాటిందన్నారు. ప్రభుత్వం మాత్రం బిల్లులు పెంచలేదని ఎలా చెబుతుందని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో అన్ని ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను అమ్మకానికి పెట్టారన్నారు. గుంటూరులో మార్కెట్ స్థలాన్ని ఏపీ బిల్డ్ కోసం అమ్మకానికి పెట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. వందలాది మంది మార్కెట్పై ఆధారపడి ఉన్నారన్నారు. తమకు పరిపాలన చేతగాక పోతే దిగిపోండని హితవు పలికారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వృద్ధురాలిపై కేసు పెట్టడాన్ని తప్పుబట్టారు.