KCR: బీజేపీ కీలక నేత విషయంలో కేసీఆర్ వ్యూహం ఫలించినట్టేనా..?
Written By:
Mallesh , Updated On : January 20, 2022 12:18 pm
KCR vs Etela
Follow us on
KCR: సీఎం కేసీఆర్ను రాజకీయ చాణక్యుడిగా అభివర్ణిస్తుంటారు కొందరు. కేసీఆర్ ఎత్తులు వేశారంటే ఆయనకు తిరుగుండదని, ప్రత్యర్థులు చిత్తు కావాల్సిందేనని పొలిటికల్ వర్గాల్లో టాక్. అయితే, టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన కీలక నేత విషయంలో ముఖ్యమంత్రి వేసిన స్కెచ్ ఫలించిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఏదో ఒక రాజకీయ ప్రయోజనం తప్పకుండా ఉంటేగానీ ముందుకు వెళ్లరని కూడా అందరికీ తెలుసు. సొంత పార్టీలో ఉండి కుట్రలు చేస్తున్నారన్న నెపంతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ను కేసీఆర్ బయటకు పంపించడమే కాకుండా ఆయన్ను తన సొంత నియోజకవర్గంలోనూ ఓడించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.
KCR
హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ వంద కోట్లు ఖర్చుచేసినా, దళితబంధు లాంటి పథకాలు తీసుకొచ్చినా ఓటర్లు మాత్రం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ కు పట్టం కట్టారు. ఈటలను సొంత నియోజకవర్గంలో దెబ్బకొట్టాలని కేసీఆర్ చేసిన వ్యూహాలు పెద్దగా ఫలించలేదు. ఈటలను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వబోమని కేసీఆర్ ప్లాన్ చేయగా.. దానికి హుజురాబాద్ ఓటర్లు రివర్స్ తీర్పునిచ్చారు.
ఈటల ఎమ్మెల్యేగా విజయం సాధించాక తెలంగాణ రాజకీయవర్గాల్లో కొత్త టాక్ వినిపించింది. బీజేపీ తరపున ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను ఢీ కొడతారని.. ఆయన బీజేపీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి కేంద్రం, బీజేపీతో పాటు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ను సీరియస్గా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయ యుద్ధం కాస్త కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా మారిపోయింది. దీంతో ఈటల రాజకీయాల్లో కాస్త వెనుకబడ్డారనే వాదనలు వినిపించాయి. కేసీఆర్ వ్యూహాలకు తోడు బీజేపీలోని అంతర్గత పరిణామాలు కూడా ఈటల రాజేందర్కు మైనస్గా మారాయని చర్చ జరుగుతోంది. బండి, ఈటల ఇద్దరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినవారే కావడంతో ఇద్దరి మధ్య రాజకీయంగా గ్యాప్ వచ్చిందని ప్రచారం సాగుతోంది.