India Military Strength: మారుతున్న యుద్ధాల తీరుతో చాలా దేశాలు సైనిక శక్తిని పెంచుకుంటున్నాయి. ఆయుధాల కొనుగోళ్లు, తయారీకి భారీగా బడ్జెట్ ఖర్చు చేస్తున్నాయి. భారత చుట్టూ ఉన్న దేశాలు.. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడక తప్పని పరిస్థితి నెలకొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ఆయుధ శక్తి ప్రపంచానికి తెలిసింది. అదే సమయంలో భారత్కు మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అనేది తేలిపోయింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా సొంత ఆయుధాల తయారీపై దృష్టి పెట్టింది. సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ ప్రపంచ రక్షణ ఖర్చు జాబితాలో ఐదో స్థానాన్ని సాధించింది. ఎస్ఐపీఆర్ఐ(స్టాక్హోం ఇటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్) తాజా నివేదిక ప్రకారం, 2025లో 92.1 బిలియన్ డాలర్ల వ్యయం(రూ.7.7 లక్షల కోట్లు) దీనికి నిదర్శనం. సరిహద్దు ఉద్రిక్తతలు, ఆధునిక ఆయుధాల కొనుగోళ్లు ఈ పెరుగుదలకు కారణాలు. కానీ ఇది కేవలం సంఖ్యల విజయమా? లేక దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాల ఒత్తిడా? ఈ ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశాలుగా మారాయి.
ప్రాంతీయ భద్రతా సవాళ్లు..
భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో మే 2025లో ఏర్పడిన ఉద్రిక్తతలు రక్షణ బడ్జెట్ పెరగడానికి ప్రధాన కారణం. పాకిస్తాన్ తన ఖర్చును 11 శాతం పెంచి 11.9 బిలియన్ డాలర్లకు చేర్చుకున్నప్పటికీ, భారత్ వ్యయం దానికి తొమ్మిది రెట్లు ఎక్కువ. డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలపై పెట్టిన దృష్టి భవిష్యత్ యుద్ధాల స్వభావాన్ని అర్థం చేసుకున్న వ్యూహాన్ని ప్రతిబింబిస్తోంది. పొరుగు దేశాల సైనిక చురుకుదలలు భారత్ను రక్షణాత్మకంగా మాత్రమే కాకుండా, ప్రాగ్రెసివ్గా మార్చాయి.
ప్రపంచ ఆయుధ పోటీ..
ప్రపంచ సైనిక వ్యయం 2.89 ట్రిలియన్ డాలర్లకు చేరి 11వ సంవత్సరం వృద్ధి చెందింది. అమెరికా (954 బిలియన్ డాలర్లు), చైనా (336 బిలియన్ డాలర్లు), రష్యా (190 బిలియన్ డాలర్లు), జర్మనీ (114 బిలియన్ డాలర్లు) ముందున్నాయి. భారత్ ఈ జాబితాలో స్థిరపడటం దేశ భౌగోలిక స్థితిని బలపరుస్తుంది. కానీ ఇది ఆయుధ పోటీలో చిక్కుకోవడం అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రతి వ్యక్తిపై సగటు 352 డాలర్ల రక్షణ భారం, జీడీపీలో 2.5 శాతం కేటాయింపు, ఇవి 2009 తర్వాత అధిక రికార్డులు. భారత్ ఈ పోటీలో పాల్గొనడం అవసరమే కానీ, స్వదేశీ ఉత్పత్తి ద్వారా ఆధారపడకుండా ముందుకు సాగాలి.
సమతుల్యం కీలకం
రక్షణపై భారీ ఖర్చు భద్రతను బలపరుస్తుంది కానీ, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలకు వెచ్చించాల్సిన నిధులను తగ్గిస్తుంది. పాక్ 31వ స్థానంలో ఉండటం భారత్ ఆధిక్యాన్ని చూపిస్తుంది కానీ, ఈ పెరుగుదల స్థిరమైన అభివృద్ధికి దోహదపడాలంటే సాంకేతిక స్వయం సమృద్ధి, అకార్యకలాపాల నిర్మూలనపై దృష్టి సారించాలి. ఎస్ఐపీఆర్ఐ అంచనాల ప్రకారం 2026లో ఈ ధోరణి కొనసాగుతుంది. భద్రతను ఆర్థిక బలంగా మార్చుకోవడానికి ఇక్కడ భారత్కు అవకాశం ఉంది.
భారత్ ఈ సైనిక ఉద్ధరణను జాతీయ గర్వంగా చూసుకోవచ్చు. కానీ ప్రభుత్వం, పౌరులు కలిసి భద్రతా అవసరాలు, సంక్షేమ లక్ష్యాల మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి. లేకపోతే, ఆయుధాల పోటీ దేశ భవిష్యత్తులో ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.