Undavalli- KCR: ప్రత్యేక ప్రాంతీయ వాదాన్ని ఒడిసి పట్టుకున్నారు కేసీఆర్. దానిని సుదీర్ఘ కాలం సజీవంగా ఉంచగలిగారు. బలమైన ఓటు బ్యాంకుగా మలచగలిగారు. టీఆర్ఎస్ స్థాపించి ఎన్నో ఆటుపోట్లు చవిచూసి రాజ్యాధికారం దక్కించుకోగలిగారు. బలీయమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దగలిగారు. ప్రస్తుతం ఢిల్లీ పెద్దలను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారు. దేశాన్ని ఏకచత్రాధిపత్యంగా ఏలాలని భావిస్తున్న మోదీపైనే దండయాత్ర ప్రారంభించారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ వాదులను, ఉద్యమకారులను దరిచేరనీయరన్న వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. అటువంటి వ్యక్తి సైద్ధాంతికంగా విభేదించే ఏపీ సీనియర్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ను ప్రగతిభవన్ కు ఆహ్వానించి ఏకంగా మూడు గంటల పాటు చర్చలు జరపడం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన ఉండవల్లి అరుణ్ కుమార్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తీరుపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికీ చేస్తుంటారు. రాష్ట్ర విభజన పుణ్యమా అని తాను ఇష్టపడే కాంగ్రెస్ పార్టీకి సైతం దూరమయ్యారు. . దీనికి సంబంధించిన కేసు ఒకటి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఉండవల్లిని రాజ ప్రాసాదం లాంటి ప్రగతిభవన్ కు కేసీఆర్ ఆహ్వానించిన తీరు ఇప్పుడు అంతటా చర్చనీయాంశమవుతోంది. కేసీఆర్ మర్యాదలను, వ్యవహారశైలిని చూసి ఉండవల్లి ఫిదా అయిపోయారు. ఏకంగా ఆంధ్రా వెళ్లి తమ మధ్య జరిగిన చర్చలను ఆనందంతో బయట పెట్టేశారు. దాదాపు మూడు గంటల పాటు వారి మధ్య సంభాషణను ఉండవల్లి చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేసిన ఉండవల్లి.. ఇవాల్టి రోజున మోడీకి చెక్ పెట్టగల నేత కేసీఆర్ మాత్రమే అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. ఇంతలా కేసీఆర్ ను ఎందుకు పొగిడినట్లు? అన్నది అందరిలో ఆసక్తి రేపే అంశంగా చెప్పాలి.

జాతీయ రాజకీయాల మీద ఫోకస్ చేసిన టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఆ హోం వర్కులో ఉన్నారు. గులాబీ బాస్ కు ఉన్న గుణం ఏమంటే.. తాను ఏదైనా అనుకుంటే దానికి సంబంధించిన అంశానికి సంబంధించి లోతుల్లోకి వెళ్లిపోతారు. అంతలా వర్కు చేసి కూడా కొన్నిసార్లు దానిని ఇట్టే వదిలేస్తారు. ఎందుకిలా? అంటే.. తనకు సూట్ కాదన్న భావన ఆయనకు కలిగితే.. అలాంటి తీరునే ప్రదర్శిస్తారని చెబుతారు. ఇదంతా ఎందుకంటే.. తనకు నచ్చిన వారిని మాత్రమే కాదు.. తనకు వ్యతిరేక రాజకీయ భావజాలం ఉన్న వారిని సైతం ఇట్టే ఆకర్షించే గుణం కేసీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపించే గుణంగా ఇదే ఆయనకు బలంగా చెప్పక తప్పదు. జాతీయరాజకీయాల మీద అవగాహన ఉన్న నేతగా తెలుగు రాష్ట్రాల్లో కాస్తంత సరుకు ఉన్న వారిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముందువరుసలో నిలుస్తారు. మేధోపరమైన అంశాలతో పాటు.. కొన్ని భావోద్వేగ అంశాల విషయంలో ఆయన మాటలు కుండ బద్ధలు కొట్టినట్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. బహుశా ఉండవల్లిలో కేసీఆర్ కు ఇదే నచ్చినట్టుంది. అందుకే ఆకాశాన్ని ఎత్తినట్టుగా అరుణ్ కుమార్ ను ప్రగతి భవన్ కు పిలిపించి రాచ మర్యాదలు చేశారు. అంతేకాదు.. ప్రగతిభవన్ కు రావాల్సి ఉంటుందన్న విషయాన్ని పది రోజుల ముందే చెప్పిన కేసీఆర్.. మూడు గంటల భేటీ తర్వాత.. త్వరలో తాను మళ్లీ పిలుస్తానని చెప్పిన తీరు చూస్తే.. ఎంతో జాగ్రత్తగా ఉండవల్లిని డీల్ చేయటంతో పాటు.. తాను అల్లాటప్పాగా రంగంలోకి దిగటం లేదన్న విషయాన్ని స్పష్టం చేసిన తీరు నచ్చినందనే చెప్పాలి. ఇదే.. కేసీఆర్ తో ఉండవల్లి లాంటి నేత కనెక్టు అయ్యారని చెప్పకతప్పదు.

నిజానికి ఉండవల్లి మాటల్ని జాగ్రత్తగా వింటే.. ఉండవల్లి ఎందుకు అంతలా పొగిడారో ఇట్టే అర్థమవుతుంది. ఉండవల్లి మాటల్లోనే చదివితే.. ”ప్రశ్నించే ప్రతిపక్షం బలంగా ఉండాలి. కానీ మోదీ దేశంలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారు. ఎవరైనా ఎదురుతిరిగి మాట్లాడితే వాళ్లమీద పాత కేసులు తిరగతోడి ఇబ్బంది పెడుతున్నారు. లేకపోతే కొత్త కేసులు పెట్టి నోరుమూయించే ప్రయత్నం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఒక సీఎం తనకు దమ్ముందని మాట్లాడడం నచ్చింది. కేసీఆర్ వంటి మనిషి ఫోన్ చేసి ఒక సామాన్యుడైన నన్ను పిలిచారు. వెళ్లాను. బీజేపీకి ప్రత్యామ్నాయం చూపాలన్న అజెండాలో ఆయన ఉన్నారు. ఈ దేశంలో ఎంత నీళ్లు ఉన్నాయి? ఎంత పవర్ జనరేషన్ ఉంది? ఎన్ని ఉద్యోగాలు వస్తాయనే విషయాలపై చాలా హోంవర్కు చేశారు. వాటిని ఒక్కొక్కటి చెబుతూ నన్ను అడుగుతుంటే ఆశ్చర్యపోయా” అని వ్యాఖ్యానించారు.