Homeజాతీయ వార్తలుKisan Seva Kendras : రైతుల కోసం ‘మోడీ’ మరో వరం

Kisan Seva Kendras : రైతుల కోసం ‘మోడీ’ మరో వరం

Prime Minister Kisan Seva Kendras : ప్రధాని మోడీ రైతుల కోసం మరో వరం ఇచ్చారు. దేశంలో రైతులకు కావాల్సిన ప్రధాన ముడి సరుకు ఎరువు. ఇప్పుడు వర్షకాలం కావడంతో ఎరువులకు చాలా డిమాండ్. ఒకప్పుడు ఎరువుల కోసం క్యూలో నిలబడి చనిపోయిన రైతులు కోకొల్లలు. కానీ మోడీ వచ్చాక ప్లానింగ్ మారింది. మార్కెట్లో ఎరువుల లభ్యత పెరిగింది. పరిశ్రమల నుంచి ఉత్పత్తి పెరిగింది. అందుకే రైతులకు కాన కష్టం ఎరువుల విషయంలో ఏర్పడడం లేదు.తాజాగా రైతులకు మరింతగా సేవ చేసేందుకు మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు.

రేపటి నుంచి ప్రధాని కిసాన్ సేవ కేంద్రాలుగా ఎరువుల రిటైల్ షాపులను మార్చుతున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. దేశంలో 2.8 కోట్ల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. తొలిదశలో 1.25 లక్షల షాప్ లని ప్రధాని రేపు ప్రారంభిస్తారని ఈ షాప్ ల్లో సల్ఫర్ కోటెడ్ యూరియా కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు

2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో రైతు సంక్షేమ కార్యక్రమాలు పెరిగాయి. ప్రధానమంత్రి మోడీ రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. తక్కువ ధరలకే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిమొట్లు, కిసాన్​ సమ్మాన్​ యోజన లాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఎరువుల రిటైల్​ షాపులను ప్రధానమంత్రి కిసాన్​ సేవా కేంద్రాలుగా రేపటి నుంచి మార్చబోతున్నది. ఎరువుల కోసం ఒక దగ్గరికి, భూసార పరీక్షలకు ఒక దగ్గరకు.. ఇలా అనేక చోట్లకు వెళ్లాల్సి వస్తున్నది. అలా కాకుండా రేపటి నుంచి రైతులకు కావాల్సిన అన్ని రకాల సేవలు.. కిసాన్​ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు నిర్దేశిత ధరల్లో రైతులకు అందుబాటులో ఉంటాయి. భూసార పరీక్షలు, సీడ్​ టెస్టింగ్​ సౌకర్యాలు ఉంటాయి. కిసాన్​ సేవా కేంద్రాలు రేపటి నుంచి అందుబాటులోకి వస్తాయి.

ఆధునిక వ్యవసాయ పద్ధతులు అప్​గ్రేడేషన్​, అవగాహన కిసాన్​ కేంద్రాల ద్వారా కృషి చేస్తారు. రైతులకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర పథకాలపై ఈ కేంద్రాలు అవగాహన కల్పిస్తాయి. రెండు కోట్ల 80 లక్షల రిటైల్​ షాపులను ప్రధానమంత్రి కిసాన్​ సేవా కేంద్రాలుగా అప్​గ్రేడే చేసే కార్యక్రమం కొనసాగుతున్నది. రేపు ప్రధాని మోడీ మొదటి దశలో లక్షా 25 వేల కిసాన్​ సేవా కేంద్రాలను ప్రారంభించబోతున్నారు.

2014లో మోడీ ప్రధాని అయిన తర్వాత నీమ్​ కోటెడ్​ యూరియా సరఫరా చేయడంతో యూరియా బ్లాక్​ మార్కెట్​ సమస్య పోయింది. నేల నాణ్యత పెరిగింది. రేపటి నంచి నీమ్​కోటెడ్​ యూరియాతోపాటు సల్ఫర్​ కోటెడ్​ యూరియా కూడా దేశమంతా రాబోతున్నది. 14వ విడత పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధులు కూడా రేపు ఉదయం ప్రధాని 8.5 కోట్ల రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తారు. తెలంగాణలో సుమారు 39 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు పడనున్నాయి. ఫార్మర్​ ప్రొడ్యూసర్స్​ ఆర్గనైజేషన్స్​(ఎఫ్​పీవో)లను ఓపీడీసీ పరిధిలోకి తీసుకొచ్చి.. రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్​ నెట్​వర్క్​ పెంచేందుకు రేపు ప్రధాని కార్యాచరణ ప్రకటిస్తారు.

ఒకప్పుడు యూరియా కోసం చెప్పులు క్యూలోపెట్టేవారు, లాఠీ చార్జీలు జరిగేవి. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల కొరత తీరింది. ఒకే దేశం.. ఒకే ఎరువు అనే కాన్సెప్ట్​ కింద.. భారత్​ బ్రాండ్​ పేరుతో రేపటి నుంచి ఎరువుల సరఫరా అమలులోకి రాబోతున్నది. కిసాన్​ సేవా కేంద్రాల్లో అన్ని రకాల వ్యవసాయ పనిమొట్లు.. అమ్మకానికి అందుబాటులో పెట్టారు. డిస్టిక్​ లెవెల్​లో డీలర్ల వద్ద పురుగుమందులు పిచికారీ చేసే డ్రోన్లను అందుబాటులో పెట్టబోతున్నాం. ఏ పంట వేయాలి? ఏ ఎరువు వాడాలనే దానిపై రైతులకు కిసాన్​ సేవా కేంద్రాలు అవగాహన కల్పిస్తాయి. సీడ్​ టెస్టింగ్​తోపాటు, వ్యవసాయానికి ఉపయోగించే వాటర్​ను కూడా టెస్టింగ్​ కూడా దేశంలో మొదటిసారి రేపటి నుంచి అమల్లోకి తీసుకువస్తున్నాం. పంటల భీమా పథకం పట్ల బ్యాంకులను, రైతులను సమన్వయం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నడుస్తాయి.

రైతుల ఇబ్బందులు, సమస్యలపై ఒకరికొకరు తెలుసుకునేందుకు ‘కిసాన్​ కి బాత్​’ రైతుల గ్రూప్​ మీటింగ్​ రేపటి నుంచి మోడీ ప్రభుత్వం అమలు చేయబోతోంది.. ప్రతి నెల రెండో అధివారం కిసాన్​ కి బాత్​ ఉంటుంది. కిసాన్​ సేవా కేంద్రం​ పరిధిలో ఉండే రైతులతో వాట్సాప్​ గ్రూప్​ క్రియేట్​ చేసి.. ఎప్పటికప్పుడు వాతావరణ, వ్యవసాయ, మార్కెట్​ అప్​డేట్లు అందులో పంపే కార్యక్రమానికి రేపటి నుంచి కేంద్రం అమల్లోకి తీసుకురానుంది.

ప్రధాన మంత్రి సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఉంటుంది. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ పర్టిలైజర్స్​ ఆ బాధ్యత తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి.. కానీ మోడీ ప్రభుత్వం భారతదేశంలో గత అనేక సంవత్సరాలుగా ఎరువుల ధరలు పెంచకుండా రైతులకు అందిస్తున్నది. 45 కిలోల యూరియా బస్తాను రైతుకు రూ.265కు ఇస్తున్నది. కానీ దాని అసలు ధర రూ. 2503 అంటే దాదాపు 2236 రూపాయలు కేంద్రం సబ్సిడీగా భరిస్తున్నది. 50 కిలోల డీఏపీ బస్తాకి 3771 రూపాయలు కాగా.. కేంద్రం రైతులకు రూ.1311 మాత్రమే ఇస్తున్నది. అంటే ప్రతి బ్యాగ్​పై రూ.2400 కేంద్రం భరిస్తున్నది. అంటే సగటున ఒక ఎకరం సాగు చేసే రైతుకు కేంద్రం ఎరువులపైనే రూ.18 వేలకు పైగా లబ్ధి చేకూరుస్తున్నది. అన్నీ కలుపుకొని పదెకరాలు సాగు చేసే రైతుకు దాదాపు 2 లక్షల రూపాయల పరోక్ష సాయం చేస్తున్నది. అమెరికాలో ఒక యూరియా బస్తాను రూ.3 వేలు చెల్లించి అక్కడి రైతు కొంటుంటే.. ఇండియాలో రైతు రూ.265కి కొంటున్నాడు. గత 9 ఏండ్లలో కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్రం రైతులను ఆదుకుంటున్నది.

రేపు తెలంగాణలో సుమారు 4 వేల ఎరువుల రిటైల్​ షాపులు.. ప్రధానమంత్రి కిసాన్​ సేవా కేంద్రాలుగా అప్​గ్రేడ్​ కాబోతున్నాయి.. ఈ కార్యక్రమంలో రైతుల భాగస్వాములు కావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. శామీర్​పేటలో జరిగే కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొంటారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular