Anil Kumar Yadav
Anil Kumar Yadav: నేను ఎవరికీ పోటీ కాదు.. నాకు నేనే పోటీ. నేను జగన్ సైనికుడిని. నా ప్రతీ రక్తపుబొట్టులో జగనే ఉంటారు. ఇప్పటి నుంచి ప్రతీ గడపగడపకు వెళతా. ప్రజలను కలుస్తా.. ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు గురించి వివరిస్తా.. తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలివి. తనను తప్పించి అవకాశం అందిపుచ్చుకున్న కాకాని గోవర్థన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు తొలిసారిగా రాగా.. ఆయనకు వ్యతిరేకంగా అనిల్ ఏకంగా పోటీ సమావేశం పెట్టారు. పదవి పోయిందన్న అక్కసుతో, ప్రస్టేషన్ తో పెట్టిన ఈ సమావేశం హీటెక్కించింది. కాకాని గోవర్థన్ రెడ్డిపై మాటలు తూటలు పేలుతాయని అంతా భావించారు. కానీ ఎందుకో అనిల్ అవి వదలి జగన్ నామస్మరణతో పాటు పనిలో పనిగా తనకు అలవాటైన పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై దుమ్మెత్తి పోశారు.
Anil Kumar Yadav
మరో సారి మంత్రినవుతా..అందరి లెక్కలు తేలుస్తా అని కూడా హెచ్చరికలు జారీచేశారు. అయితే ఆయన లెక్క తేల్చేది పార్టీలో ఉన్న తన వ్యతిరేకులపైనా.. లేకుంటే పవన్, చంద్రబాబులపైనా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆయన తన శైలికి విరుద్ధంగా హావభావాలను మార్చేశారు. తనలో ఉన్న ప్రస్టేషన్ ను బయటపెడుతూనే ప్రతీకారంతో రగిలిపోతున్నట్టు కనిపించారు. కానీ కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నట్టు చెప్పకనే చెప్పారు కానీ..మంత్రి పదవి పోయిందని తనలో ఇసుమంత బాధ లేదని చెప్పడం ద్వారా తనలో ఉన్న బాధను బయట పెట్టేశారు. అసలు మంత్రి పదవిపై ఆశలు లేకుంటే మరోసారి మంత్రినవుతానంటూ ఎందుకు వ్యాఖ్యానించినట్టు? కాకాని గోవర్థన్ రెడ్డి వచ్చిన రోజే పోటీ సభ ఎందుకు పెట్టినట్టు? కొత్తగా ప్రజలను కలుస్తా అని ఎందుకు అన్నట్టు? అంటే ఈ మూడేళ్ల కాలం ప్రజలను పట్టించుకోలేదా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫాన్స్ కి ఊహించని షాక్ ఇవ్వబోతున్న కొరటాల శివ
అధిష్టానం హెచ్చరికలతో అనిల్ కుమార్ రూటు మార్చారని.. తన ఒంటికి అలవాటు అయిన దూకుడును మార్చి సాత్వికంగా మారిపోయారని టాక్ వినిపిస్తోంది. అందుకే రాజకీయ వైరాగ్యులు మాట్లాడే విధంగా కొత్త పల్లవిని అందుకున్నారు. అధిష్టానం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోనన్న భయంతో స్వపక్షంలో విపక్షంపై ఘాటైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడ్డారు. మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డికి వ్యతిరేకంగా బల ప్రదర్శనకు దిగిన అనిల్ సక్సెస్ అయ్యారా? లేకుండా ఫెయిలయ్యారనే దాని కంటే.. అధిష్టానానికి భయపడ్డారని మాత్రం ఇట్టే చెప్పొచ్చు.
ఎప్పటి నుంచో విభేదాలు
అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్థన్ రెడ్డి నడుమ ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. తొలి మంత్రివర్గ విస్తరణ రోజు నుంచీ పరస్పరం పొసగడం లేదు. తనకు రావలసిన మంత్రి పదవిని అనిల్ తన్నుకుపోయారని కాకాణి అప్పట్లో తెగ బాధపడిపోయారు. గడచిన మూడేళ్లూ ఇద్దరూ ఉప్పు, నిప్పులాగే ఉన్నారు. కాకాణి వర్గీయులు గ్రావెల్ అక్రమ రవాణా చేశారని అనిల్.. ఇసుక స్మగ్లింగ్లో అనిల్ వర్గీయులు ఉన్నారని కాకాణి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. అదే జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం అనిల్ను పూర్తిస్థాయిలో వ్యతిరేకించారు. మంత్రి పదవి వెలగబెట్టిన అనిల్ అప్పట్లో సర్వేపల్లి, వెంకటగిరిల్లో అడుగు కూడా పెట్టలేకపోయారు. ఇప్పుడు కాకాణి మంత్రి కావడంతో అదే తరహా మర్యాద ఇవ్వాలని అనిల్ నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని మీడియా ముందు కూడా తేల్చి చెప్పారు. కాకాణి అన్న తనకెంత సహకరించారో, ఎంత గౌరవించారో అంతకు రెట్టింపు సహకారం ఇస్తానని తన మనసులో మాట బయటపెట్టారు. ఇంతలో మంత్రి కాకానికి స్వాగతం పలుకుతూ నెల్లూరు నగరంలో భారీ ఫ్లెక్సీలను అభిమానులు ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రే ఆ ఫ్లెక్సీలను ఎవరో తొలగించారు. దీని వెనుక అనిల్ కుమార్ యాదవ్ హస్తం ఉందని ప్రచారం సాగింది. కాకాని వస్తున్న సమయంలో అనిల్ పోటీ సభ నిర్వహించడం, అనిల్ భారీగా జన సమీకరణ చేయడం, మంత్రి స్వాగత కార్యక్రమానికి వెళ్లకుండా కార్యకర్తలు, నేతలను నియంత్రించడం ఒక్కసారిగా పరిస్థితిని హీటెక్కించింది. అటు అధిష్టానికి కలవర పాటుకు గురిచేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా దాదాపు 1000 మంది పోలీసులు నెల్లూరు నగరాన్ని చుట్టుముట్టారు.
అధిష్టానంలో కలవరం
నెల్లూరు వైసీపీలో వెలుగుచూసిన విభేదాలు అధిష్టానానికి కలవరపాటుకు గురిచేశాయి. సీఎం జగన్ ఇద్దరు నేతలపై సీరియస్ అయ్యారు. వారిని నియంత్రించే బాధ్యతలను ఓ కీలక నాయకుడికి అప్పగించారు. వెనక్కి తగ్గాలని తన మాటగా చెప్పాలని ఆదేశించారు. దీంతో సీన్ రివర్ష అయిపోయింది. పోటీ సభ పెట్టి కాకానికి హెచ్చరికలు పంపాలన్న అనిల్ యాదవ్ నీరుగారిపోయారు. జగన్ ను పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు వైరాగ్య వ్యాఖ్యానాలు చేశారు. ఎవరైనా జగన్ బొమ్మ పెట్టుకునే ఎమ్మెల్యేగా గెలవగలరని తేల్చేశారు. తమకు తాము సొంతంగా 5 వేల ఓట్లు కూడా తెచ్చుకోలేమని చెప్పేశారు. తాము బలవంతులుగా అనుకుంటే అది వాపే కానీ.. బలం కాదని అధిష్టానానికి ఉపశమనం కలిగేంచేలా మాట్లాడారు. అబ్బెబ్బె ఇది అసలు పోటీ సభ కానేకాదన్నారు. మూడు రోజులు ముందుగానే ప్లాన్ చేసుకున్న సభ అని అనిల్ చెప్పకొచ్చారు. అటు మంత్రి కాకాని కూడా తన స్పీడ్ ను తగ్గించారు. అనిల్ సభ యాదృచ్ఛికమని, తమ మధ్య విభేదాలు లేవని ప్రకటించారు. అయితే మంత్రి కాకాని స్వాగత కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే నల్లమలుపు ప్రసన్నకుమార్ రెడ్డి సైతం ముఖం చాటేశారు. అయితే భవిష్యత్ లో అనిల్ తో ఈ ఇద్దరు జట్టు కడతారన్న ప్రచారం సాగుతోంది. వారి సహకారంతోనే డబుల్ సహకారం అందిస్తానని అనిల్ ప్రకటించారు. పోటీ సభ పెట్టారు. కానీ తానొకటి తలిస్తే మరొకటి జరిగింది. అధిష్టానం ఆదేశాల మేరకు అనిల్ వెనక్కి తగ్గక తప్పలేదు.
Also Read: Pawan Kalyan New Movie: KGF డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. సంబరాల్లో ఫాన్స్