Homeజాతీయ వార్తలుఆర్టీసీల పంతాలు.. ప్రైవేట్ బస్సుల దందాలు.. ప్రయాణికులకు కష్టాలు

ఆర్టీసీల పంతాలు.. ప్రైవేట్ బస్సుల దందాలు.. ప్రయాణికులకు కష్టాలు

rtc-delay-benefit-to-private
rtc-delay-benefit-to-private

సంక్రాంతి తర్వాత ఏపీ జనాలు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు భారీగా తరలివెళ్లేది దసరాకే.. ఇప్పటికే పండుగ సందడి మొదలైంది. ఇంటికెళ్దాం అని బస్టాండ్లకు బయలుదేరిన ప్రయాణికులకు బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. పండుగ పూట ఇలా చేస్తున్నారేంటి అని వాపోతున్నారు. కనీసం ప్రభుత్వం బస్సు సౌకర్యం కల్పించకపోతే ఎలా అని విసుగెత్తిపోతున్నారు. ఇలాంటి కీలక తరుణంలో బస్సులు అందుబాటులో ఉంచరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: జగన్‌ లేఖతో మోడీ-షాలకు తలనొప్పులు?

బస్సు సౌకర్యం కల్పించకపోవడానికి ప్రధాన కారణం.. ఏపీఎస్ ఆర్టీసీ,  టీఎస్ ఆర్టీసీ పంతాలకు పోవడమే .. ఇరు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు ఇంకా ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. కనీసం దసరాకు వారం ముందైనా సర్వీసులు మొదలవుతాయని ఏపీ ఆర్టీసీ ఆఫీసర్లు భావించారు. తెలంగాణ ఆర్టీసీ డిమాండ్ చేసినట్లే ఆ రాష్ట్ర పరిధిలో నిత్యం 1.61లక్షల కి.మీ. నడుపుతామంటూ ఏపీఎస్ ఆర్టీసీ ఇటీవల ప్రతిపాదనలు పంపింది. అయితే ఇప్పటివరకు తెలంగాణ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. సోమ, మంగళవారాల్లో నిర్ణయం తీసుకుని, ముందుగా కొన్ని సర్వీసులు నడిపేందుకు అంగీకరిస్తే దసరాకు ఇరు ఆర్టీసీలు బస్సులు నడిపేందుకు అవకాశం ఉంటుంది. దసరా సందర్భంగా హైదరాబాద్– బెంగళూరు మధ్య కర్నూలు, అనంతపురం మీదుగా సర్వీసులు నడుపుతామని టీఎస్ ఆర్టీసీ కోరింది. ఏపీ కి సర్వీసులపై తేల్చిన తర్వాతే బెంగళూరు సర్వీసులకు అనుమతిస్తామని ఏపీఎస్ ఆర్టీసీ ఆఫీసర్లు స్పష్టం చేశారు.

* ప్రైవేట్ బాదుడు..
ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు లేకపోవడంతో.. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్ దందాకు తెరలేపాయి. టికెట్ చార్జీలను భారీగా పెంచుతున్నాయి. దసరా దగ్గరకొస్తున్న కొద్దీ రేట్లు రెట్టింపు చేస్తూ ఆన్ లైన్ టికెట్లు అమ్ముతున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్– విజయవాడ రూట్లో సూపర్ లగ్జరీ సర్వీసుల్లో రూ.200–300, ఏసీ స్లీపర్ లో రూ.500 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈనెల 21నుంచి 24వ తేదీల మధ్య సూపర్ లగ్జరీ సర్వీసుల్లో రూ.500, ఏసీ స్లీపర్ లో రూ.వెయ్యి వరకు ధర పెంచి ఆన్లైన్ లో ముందస్తు టికెట్లు విక్రయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ పట్టణం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ జిల్లాలకు వెళ్లే మార్గల్లోనూ చార్జీలు భారీగా పెంచారు.

Also Read: రూట్‌ మార్చిన చంద్రబాబు: టార్గెట్‌ 2024.. ఏంటా కథ?

* ప్రజల ఇబ్బందులు.. ప్రభుత్వాలకు పట్టవా?
ఆర్టీసీ బస్సులను ఆశ్రయించేది ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలే. హైదరాబాద్ లో చిన్న చిన్న ఉద్యోగాలు, షాపులు పెట్టుకుని జీవిస్తున్న వారికి .. పండుగ పూట ఇంటికెళ్దామనుకుంటే ప్రయాణం భారమే అవుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ కు వేలాల్లో చార్జిలు కట్టే స్థోమత ఉండదు. రైళ్లలో వెళ్దామంటే అవి నడువట్లేదు.. నడిచినా ఒకటి, రెండే. ఎలా చూసినా పేదలకు మేలైనా మార్గం ఆర్టీసీ ఒక్కటే. అలాంటిది రెండు ఆర్టీసీ ల మధ్య చర్చలు పెను భారమవుతున్నాయి. ఇప్పటికైనా పేద, మధ్య తరగతి ప్రయాణికుల ఇక్కట్లు తీర్చేలా రెండు ఆర్టీసీలు చర్చలు ఫలప్రదం చేసుకోవాల్సిన అవసరముందని ప్రయాణికులు కోరుతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular