Haryana Assembly Elections 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ హోరాహరీగా తలపడుతున్నాయి. మరోవైపు ఆప్ తాము లేకుండా ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేరంటున్నారు. చక్రం తిప్పుతామంటోంది. మరోవైపు ఎన్నికల ఫలితాలపై సర్వేలు మాత్రం బీజేపీ గెలుపు కష్టమంటున్నాయి. కాంగ్రెస్కు ఈసారి అవకాశం దక్కుతుందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పోటాపోటీగా మేనిఫెస్టోలు ప్రకటించాయి. వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈసారి ఎన్నికల్లో ఓ పార్టీ నేత మౌనం కూడా ప్రచారాస్త్రంగా మారింది. సిర్సా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సెల్జా గతంలో మన్మోహన్సింగ్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్లో సీనియర్ దళిత మహిళానేత సెల్జా. హర్యానాలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఉన్నారు సెల్జా. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమె మౌనం ఇప్పుడు హర్యానాలో చర్చనీయాంశమైంది. సెప్టెంబర్ 12 వరకు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన సెల్జా.. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ప్రచారం ఊపందుకున్న వేళ.. బీజేపీపై విరుచుకుపడాల్సిన నేత అకస్మాత్తుగా మౌనం పాటించడం ఇప్పుడు ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. దళిత మహిళా నేతను కాంగ్రెస అవమానించిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇక పలుపార్టీలు తమ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ముఖచిత్రం రసవత్తరంగా మారింది.
సెల్జాను పట్టించుకోని కాంగ్రెస్…
హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా మౌనం పాటించడం, కాంగ్రెస్ ప్రచారానికి దూరంగా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సెల్జాను బుజ్జగించాల్సిన కాంగ్రెస్ అధిష్టానం కూడా మౌనం వహిస్తోంది. మాజీ సీఎం భూపేందర్సింగ్ కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితని బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి అధికార బీజేపీ, విపక్ష బీఎస్పీ, వివిధ పార్టీలు. బీజేపీ నేత, కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్, అర్జున్ రామ్ మేఘ్వాల్, బీఎసీ సమన్వయకర్త ఆకాశ్ ఆనంద్ సెల్జాతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారు. దీంతో సెల్జా తీరు ఇప్పుడు హర్యానాలో ఎన్నికల అస్త్రంగా మారింది. బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి కూడా సెల్జా పేరుతో దళిత నేతలను తనవర్గం ఓటర్లను ఆకర్షించే ఎత్తుగడ వేశారు.
దళితుల ఓట్లు కీలకం
హర్యానాలో పార్టీల గెలుపులో దళితుల ఓట్లు కూడా కీలకం. అత్యంత వెనుకబాటుతనానికి, సామాజిక వివక్షకు గురవుతున్నారు దళితులు. అయితే గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో దళిత ఓటర్లు ఉన్నారు. 21 శాతం మంది దళితులు ఉన్నారు. దీంతో దళిత ఓట్లను చీల్చడంపై కాంగ్రెస్ దృష్టిపెట్టింది. బీజేపీ, బీఎస్పీతోపాటు ప్రాంతీయ పార్టీలు సెల్జా కోపాన్ని దళితుల ఆత్మగౌరవంగా చిత్రీకరిస్తున్నారు. కాంగ్రెస్ను దోషిగా చూపుతున్నారు. తద్వారా దళితులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సెల్జా మౌనం ఎందుకు?
ఇదిలా ఉంటే సిరాస ఎంపీ కుమారి సెల్జా అసలు ఎందుకు మౌనంగా ఉన్నారన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో మాజీ సీఎం హుడా క్యాంపుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు సెల్జా సన్నిహితులు పేర్కొంటున్నారు. సెల్జా సూచించిన నేతలకు టికెట్లు ఇవ్వలేదు. ఆమె తన ఓఎస్డీ డాక్టర్ అజయ్ చౌదరికి కూడా టికెట్ ఇప్పించుకోలేకపోయారు. ఈ పరిస్థితిలో మాజీ సీఎం హుడా మద్దతుదారులు చేసిన వ్యాఖ్యలు కూడా సెల్లాను ఇబ్బంది పెట్టాయి. దీంతో ఆమె మౌనంగా, ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. మరి సెల్టా మౌనం ఎవరికి లాభిస్తుందో తెలియాలంటే.. అక్టోబర్ 8 వరకు వేచి చూడాలి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More