
కరోనా వైరస్ ను చైనాలోని వుహాన్ ల్యాబ్ లో సృష్టించారా అనే అంశాన్ని తమ ప్రభుత్వం నిగ్గుతేల్చేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ విషయం పై స్పందించిన చైనా.. ఆ అంశంపై క్లారిటీ ఇచ్చింది. “వైరస్ ని మా దేశంలోని ఓ ల్యాబ్ లో సృష్టించారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసిందని” చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 2019 చివరిలో ప్రాణాంతక వైరస్ ను గుర్తించిన వుహాన్ ప్రాంతంలోని ఓ లేబొరేటరీలో కరోనా వైరస్ ను పుట్టించారన్న ఆరోపణలను ప్రస్తావిస్తూ చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జో లిజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను ల్యాబ్ లో సృష్టించలేదని డబ్ల్యూహెచ్ఓ అధికారులు పలుమార్లు చెప్పారని గుర్తుచేశారు.
కోవిద్-19 పై తమకు తెలిసిన అంశాలతో చైనా నిజాయితీగా ప్రపంచం ముందుకు రావాలని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కోరారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 20,94,839 కరోనా కేసులు నమోదవగా, 1,35,569 మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది. 5,20,000 మంది కరోనా పాజిటివ్ రోగులు కోలుకున్నారు.