
ఇటీవల తెలంగాణ సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం తలిచింది. దీంతో ఈ మేరకు టెండర్లు నిర్వహించి నిర్మాణం ప్రారంభించాలని ఆదేశించింది. కానీ.. ఇంతవరకు పనుల్లో ఏ మాత్రం పురోగతి లేదు. దీంతో సీఎం కేసీఆర్ వర్క్ ఏజెన్సీలకు దిశానిర్దేశం చేశారు. ఏడాదికంటే ఒక్కటంటే ఒక్క రోజు ఎక్కువ సమయం కూడా ఇచ్చేది లేదని .. ఆ లోపు నిర్మాణం పూర్తి చేయాల్సిందేనని ఆదేశించారు.
రిపబ్లిక్ డే రోజు ముందస్తు షెడ్యూల్లో లేకపోయినా ఆయన సచివాలయం పనులు పరిశీలించడానికి వెళ్లారు. అయితే అక్కడ జరుగుతున్నది చూసిన కేసీఆర్ తాను అనుకున్నది వేరు జరుగుతున్నది వేరని అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద నిర్మాణయంత్రాలతో.. చురుగ్గా పనులు సాగుతాయని ఆయన ఆశించినట్లుగా ఉన్నారు కానీ.. ఇంకా అక్కడ పునాదులు కూడా పూర్తి కాలేదు. చాలా పునాదులు ఇంకా తవ్వే దశలోనే ఉన్నారు. కింద రాళ్లు ఉన్నాయని అందుకే ఆలస్యం అవుతోందని నిర్మాణ సంస్థల ప్రతినిధులు వివరణ ఇవ్వగా.. ఏం చెప్పినా సరే ఏడాదికి మించి సమయం ఇవ్వబోమని.. ఆ లోపు కట్టాల్సిందేనని కేసీఆర్ తేల్చి చెప్పారు.
తెలంగాణకు కొత్త సచివాలయం నిర్మించాలని సీఎం కేసీఆర్ మొదటి సారి సీఎం సీటు ఎక్కినప్పటి నుంచి కల. చాలా సార్లు శంకుస్థాపన వరకూ వెళ్లింది. కానీ సాధ్యం కాలేదు. ఓ సారి ఎర్రగడ్డ అన్నారు.. మరోసారి బైసన్ పోలో గ్రౌండ్స్ అన్నారు. దాదాపుగా అన్ని ప్రయత్నాలూ చేశారు. చివరికి ఎక్కడా కుదరలేదు. ఎన్నికల ఫలితాలు కలిసి రావడంతో ఏపీకి కేటాయించిన భవనాలన్నింటినీ స్వాధీనం చేసుకుని కూలగొట్టి.. ప్రస్తుతం ఉన్న చోటే విశాలమైన స్థలం క్రియేట్ చేశారు. అందులోనే కొత్త సచివాలయ నిర్మాణం ప్రారంభించారు. కానీ.. అనుకున్నట్లుగా సాగడం లేదు. పర్యావరణ అనుమతుల పేరుతో ఇంతకాలం లేట్ అయింది.
ముందుగా.. ఆరు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లు ప్రభుత్వం లీకులు ఇచ్చింది. బడ్జెట్ కూడా విడుదల చేసింది. కానీ.. ఆరు నెలల్లో సాధ్యం కాదని.. ఏడాదికి డెడ్లైన్ మార్చింది. కొత్త సచివాలయానికి తెలంగాణ రాజకీయాలకు సంబంధం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. సీఎంగా ఇందులో బాధ్యతలు చేపట్టేది కేటీఆరేనని టీఆర్ఎస్ నేతలు బలంగా నమ్ముతున్నారు. అయితే.. ఈ భవనం నిర్మాణం ఇప్పుడు వచ్చే ఏడాదికి మారిపోయింది. మరి కేటీఆర్కు పట్టాభిషేకం సంగతి కూడా మారుతుందా.. లేక అనుకున్న టైమ్కే సీఎం సీట్లో కూర్చోబెడతారా అనేది తెలియకుండా ఉంది.