Chandrababu Bail Petition: చంద్రబాబుపై వైసీపీ సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు జైలు నుంచి బయటకు రాకుండా పట్టు బిగిస్తోంది. వీలైనంతవరకు ఎక్కువ రోజులు ఆయన రిమాండ్ ఖైదీగా జైలులోనే గడిపేలా పక్క ప్లాన్ తో ముందుకు సాగుతోంది. పిటిషన్ మీద పిటిషన్ వేసి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తొలుత స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు రిమాండ్ విధించారు. తరువాత అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు, అటు తరువాత చిత్తూరు జిల్లా అంగళ్లు ఘటనకు సంబంధించి ఏ 1 గా చూపుతూ కస్టడీకి కావాలని కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు.
ఆగస్టు 4న ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్ళు, పుంగనూరులో చంద్రబాబు పర్యటన విధ్వంసానికి దారితీసింది. పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు సహా 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1 గా చేర్చారు. అయితే అప్పట్లో మిగతా నిందితులంతా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబు మాత్రం ఏమీ కాదన్నట్టుగా అప్పట్లో ఉండిపోయారు.
ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసులో.. రిమాండ్ ఖైదీగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం అంగళ్లు కేసును మరోసారి తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టులో బెయిల్ పై పిటిషన్ దాఖలు చేసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ కు పిటిషన్ దాఖలు చేసినట్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో అంగళ్లు కేసునకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఈనెల 20 వరకు వాయిదా వేసినట్లు హైకోర్టు స్పష్టం చేసింది.
చంద్రబాబు విషయంలో వైసీపీ సర్కార్ దూకుడుగా ముందుకెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లుంది. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ ముప్పేట విమర్శల దాడి ఎదురవుతున్నా.. జగన్ సర్కార్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. గతంలో నమోదైన కేసులకు సంబంధించి పిటిషన్ల మీద పిటిషన్లు వేసి.. రిమాండ్ ను పొడిగించాలన్నదే వైసీపీ సర్కార్ ప్లాన్. అయితే కొన్ని కేసుల్లో ప్రభుత్వానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. కానీ చంద్రబాబు బెయిల్ కంటే.. కేసులు పూర్తిగా కొట్టివేతకు వచ్చేలా.. తన న్యాయవాదులతో పావులు కదుపుతున్నారు.