లాక్డౌన్ తో పట్టణాలలో ఉపాధి అవకాశాలు స్తంభించి పోవడంతో లక్షల సంఖ్యలో వలస కార్మికులు గ్రామాలకు ప్రయాణం కావడం పట్ల కేంద్రం కలవరం చెందుతున్నది. అందుకనే తక్షణం రాష్ట్రాల సరిహద్దులతో పాటు జిల్లాల సరిహద్దులను కూడా మూసి వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కరోనా వైరస్ గ్రామాలకు వ్యాప్తి చెందకుండా కట్టడి చేయాలని సూచించింది.
కేవలం నిత్యవసర సరుకులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని స్పష్టం చేస్తూ గ్రామాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందితే అక్కడ వారికి వైద్య సదుపాయాలు, దిగ్బంధన సౌకర్యాలు కల్పించడం దుర్లభం కాగలదని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే సరిహద్దులు దాటిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచాలని సూచించిది.
నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ప్రయాణం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. లాక్డౌన్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఆదివారం కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గూబా జరిపిన వీడియో కాన్ఫరెన్స్లో కొన్ని ప్రాంతాల్లో వలసకూలీలు.. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నట్లుగా గుర్తించామని దీనిని పూర్తిగా నివారించాలని స్పష్టం చేసారు.
ఎక్కడైనా ప్రజలు ప్రయాణాలు చేస్తే దానికి స్థానిక కలెక్టర్లు, ఎస్పీలను బాధ్యులు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర విపత్తుల చట్టం కింద ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఈ బాధ్యతను తమ భుజాలకెత్తుకోవాలని ఆదేశించారు.