vaishali kidnap Telugu news channel : తెలుగు న్యూస్ చానల్ ఎన్టీవీకి తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు.. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగన్నగూడ గ్రామానికి చెందిన యువతి వైశాలి కిడ్నాప్ కేసుకు సంబంధించిన వార్త ప్రసారం చేస్తున్నప్పుడు ఆ యువతి ఫొటోను తప్పుగా ఎన్టీవీలో ప్రసారం చేసినట్లు బా«ధితురాలు ఫిర్యాదు మేరకు చాదర్ఘాట్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫేస్.. బ్లర్ చేయలేదని
ఆదిబట్లకు చెందిన దంత వైద్యురాలు వైశాలి కిడ్నాప్ ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. వందమంది యువకులతో వచ్చిన నవీన్రెడ్డి యువతిని ఎత్తుకునిపోయాడు. దీనిని కవరేజ్ చేయడంలో తెలుగు మీడియా చానెళ్లు పోటీపడ్డాయి. మొదట ఎన్టీవీ దీనికి సంబంధించి బ్రేకింగ్ ఇచ్చింది. మొదట దాడి చేస్తున్న వీడియోలు ప్రసారం చేసింది. ఇదే సమయంలో నవీన్రెడ్డితో వైశాలి సన్నిహితంగా ఉన్న ఫోటోను ప్రసారం చేసింది. ఈ సమయంలో తన ఫొటోను కనీసం బ్లర్ చేయలేదని కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బయటపడ్డ వైశాలి మనస్తాపం చెందింది.
పోలీసులకు ఫిర్యాదు..
తెలుగు న్యూస్ చానల్ ఎన్టీవీ తన చిత్రాన్ని తప్పుగా ప్రచారం చేసి తన పరువు తీసేలా వ్యవహరించిందని బాధితురాలు వైశాలి చాదర్ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవీన్రెడ్డితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు మార్ఫింగ్ చేసినవే అని చెప్పిన బాధితురాలు, ఆ ఫొటోలను ప్రసారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీవీ యాజమాన్యం వాస్తవాలను, కేసు వెనుక ఉన్న వ్యక్తులను ధ్రువీకరించకుండా తన ఫొటోను ఉపయోగించి దుశ్చర్యతో వార్తలను ప్రసారం చేసిందని, అంటితో ఆగకుండా విస్తృతంగా ప్రచారం చేయడానికి కారణమైందని, సోషల్ మీడియాలో కూడా ప్రచారానికి కారణమైందని బాధితురాలు ఫిర్యాదులో వివరించింది. ఎన్టీవీ మేనేజ్మెంట్ చర్యలకు నేను తీవ్రంగా బాధపడ్డానని తెలిపారు. ఇది వ్యక్తిగతంగా తనపై తీవ్రమైన నేరం, యాజమాన్యం ఈ నిర్లక్ష్య చర్య సమాజంలో నా వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చిందని వెల్లడించారు. ఈ విషయంలో వారిపై తగిన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరారు.
ఎన్టీవీపై కేసు..
వైశాలి ఫిర్యాదు మేరకు ఎన్టీవీపై ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈమేరకు చానల్ మేనేజ్మెంట్కు నోటీసులు కూడా జారీ చేశారు. తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరి ఈ కేసును ఎన్టీవీ యాజమాన్యం ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది.