
ఏపీలో రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ఇష్టపడిన వారిపై కేసులు లేకుండా చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఉదయభానుపై ఏకకాలంలో కేసులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందని ఆశ్చర్యపోతున్నారు. ఒకరిపై కేసులు, మరొకరిపై కేసులు ఎత్తివేత ఏంటని ప్రశ్నిస్తున్నారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ప్రత్యేక న్యాయస్థానంలో ఉదయభానుపై ఉన్న పది కేసులను ఎత్తేస్తూ ఉత్తర్వులిచ్చారు. వాటన్నింటిని ఒకేసారి ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మార్చి 23న డీజీపీ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు హోం మంత్రిత్వ శాఖ కేసుల ఎత్తివేత ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు వీలుగా ఆయా న్యాయస్థానాల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో పిటిషన్లు దాఖలు చేయించాలని డీజీపీని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కాగా సీఎస్పీఏ ఆర్గనైజేషన్ పేరిట సర్వే నిర్వహిస్తున్న కొందరు సిబ్బందిని అక్రమంగా నిర్బంధించారని, వారిని అక్రమంగా అపహరించి నేరపూరితంగా బెదిరించారన్న ఫిర్యాదుప జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
జగ్గయ్యపేట ఎన్టీఆర్ సర్కిల్ లో ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు ఆర్అండ్ బీ ఏఈఈ విధులకు ఆటంకం కలిగించడం, నేరపూరిత బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై నమోదైన మరికొన్ని కేసులు, వత్సవాయి, నందిగామ, చిల్లకల్లు స్టేషన్లలో నమోదైన పలు కేసులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సామినేని ఉదయభాను కేసులు లేని ఉదయభానుగా మారిపోయారు.