BJP – Bandi Sanjay : రెండు మూడు రోజులుగా మీడియాలో ఒకటే హడావుడి.. తెలంగాణ బీజేపీ చీఫ్ ను మార్చబోతున్నారని.. బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని పెట్టబోతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. బండి సంజయ్ ను కేంద్రమంత్రిగా పంపుతున్నారంటూ కొన్ని మీడియా సంస్థలు తెగ ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలపై బండి సంజయ్ స్పందించారు. సంచలన ప్రకటన చేశారు.
‘‘తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై తరుణ్ చుగ్ సహా జాతీయ నాయకులు అనేకసార్లు స్పష్టమైన ప్రకటన చేశారు. అయినా నన్ను మారుస్తున్నారంటూ కొన్ని ఛానళ్లు పదేపదే వార్తలు రాస్తున్నాయి. ఆ వార్తలు చూసి చూసి మా కార్యకర్తలకు అలవాటైపోయింది. రాసి రాసి మీకు అలవాటైనట్లుంది. ఎక్కడైనా నిప్పు లేనిదే పొగరాదంటారు. కానీ ఏడాది నుండి నన్ను మారుస్తారని మీరు టీవీల్లో చూపిస్తూనే ఉన్నారు… ఆ నిప్పు లేదు.. పొగ లేదు.. ఇదంతా కేసీఆర్ లాంటి మూర్ఖుడు చేస్తున్న కుట్ర. సొంత పార్టీ సంగతిని పక్కన పెట్టి పక్క పార్టీల్లో పొగపెట్టాలని చూస్తున్నరు. మా కార్యకర్తలెవరూ వీటిని పట్టించుకోవడం లేదు’’ బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి తప్పించి కేంద్ర మంత్రిగా నియమించబోతున్నారంటూ ఓ ఛానల్ లో వచ్చిన వార్తపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలివి. ‘‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’’ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ రేల్వే స్టేషన్ కు చేరుకున్న ‘‘విస్తారక్’’ లకు బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్పసహా పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
బీజేపీ అధ్యక్ష నాయకత్వ మార్పుపై తరుణ్ చుగ్ సహా మా పార్టీ జాతీయ నాయకులు అనేకసార్లు స్పష్టమైన ప్రకటన చేశారు. అయినా నన్ను మారుస్తున్నారంటూ కొన్ని ఛానళ్లు వార్తలు పదేపదే రాస్తున్నాయి. మేం అవన్నీ పట్టించుకోం. జేపీ నడ్డా ఆదేశానుసారం పనిచేస్తామని బండి సంజయ్ అన్నారు.
ఈటల రాజేందర్ హత్యకు కుట్ర చేసిన వారిపై తక్షణమే విచారణ జరపడంతోపాటు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎందుకంటే గతంలో మాపై దాడులు చేసిన వాళ్లను అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టి ఉల్టా మమ్ముల్నే జైల్లో పెట్టారు. ఇప్పటికైనా దోషులను, అనుమానితులను అరెస్ట్ చేసి కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ది నిరూపించుకోవాలి. అదే సమయంలో ఈటల రాజేందర్ కు కచ్చితంగా తగిన భద్రత కల్పించాల్సిందేనని బండి సంజయ్ అన్నారు.
మొత్తంగా బీజేపీ అధ్యక్షుడి మార్పు వార్తలపై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ అగ్రనేతలు సైతం బండినే కొనసాగిస్తామని అంటున్నారు. దీంతో ఈ వివాదానికి ముగింపు పడినట్టైంది.