రెండు రాష్ట్రాల నీటి పంచాయితీ మూలమైన రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేది లేదని జగన్ చెబుతున్నారా? ఎవరు చెప్పినా వెనక్కి తగ్గకూడదని భావిస్తున్నారా? అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. కేంద్రానికి రాసిన లేఖలో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని ఉప్పందుతోంది. దీని ప్రకారం.. కృష్ణాబోర్డు చెప్పినా.. మరెవరు అభ్యంతరం తెలిపినా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిచేసి తీరాలని జగన్ కంకణం కట్టుకున్నారని అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు.
నీటి పంచాయితీకి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య లేఖల యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. కృష్ణాబోర్డుకు, కేంద్రానికి ఉత్తరాలు రాస్తున్నారు. అయితే.. కేంద్రానికి రాసిన లేఖలో ఏపీ సర్కారు కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను సందర్శించిన తర్వాతనే.. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం జరిగే ప్రదేశానికి రావాలని కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లేఖలో స్పష్టం చేశారట. అంతేకాదు.. అక్కడ పర్యటించకుండా ఎన్జీటీ ఆదేశించినా, మరే ఇతర కారణంతోనైనా కృష్ణాబోర్డు బృందం వస్తే.. రానివ్వబోమని కూడా తేల్చి చెప్పారని సమాచారం.
ఈ విషయం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కృష్ణాబోర్డు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించాలని సిద్ధమైనా.. ఏపీ సర్కారు తన అంగీకారం తెలపలేదు. దీంతో.. కేంద్రం బలగాలతో వెళ్లాలని కృష్ణాబోర్డు సభ్యులు భావించారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. జగన్ ఈ తరహా లేఖ రాశారని వార్తలు వస్తుండడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది.
ఇప్పటికే.. రెండు రాష్ట్రాలు మధ్యవర్తులతో సంబంధం లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ ఇప్పుడు కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటు తెలంగాణ తాము ఎందుకు మౌనంగా ఉంటామంటూ.. విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టింది. ఇలా.. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు నిర్ణయాలు తీసుకుంటే.. కృష్ణాబోర్డుగానీ, కేంద్రంగానీ ఎందుకు ఉన్నాయనే ప్రశ్న తలెత్తుతోంది. మొత్తానికి జల జగడం అయితే.. ఇప్పట్లో చల్లారేట్టు కనిపించట్లేదు. మరి, ఏం జరుగుతుందన్నది ముందు ముందు చూడాలి.