దేశంలో కావొచ్చు.. రాష్ట్రంలో కావొచ్చు.. రాజకీయ నేతలు ప్రధానంగా రెండు రకాలు. జనం కోసం జీవితాలను ధారపోసే వారు ఒక రకమైతే.. తమ లాభం కోసం దేశం, రాష్ట్రం నాశనమైపోయినా చూస్తూ ఉండేవారు, నాశనం చేసేవారు మరో రకం. ఇప్పుడు ఏపీలో రెండో రకం రాజకీయ నేతలే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం.. రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించడంలోనూ, కనీసం పోరాటం సాగించడంలోనూ ఏపీ అధికార, విపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై ఏహ్య భావం కలగక మానదు. ఇప్పుడు ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కాపాడేందుకు కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం వారి స్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని అంటున్నారు ఏపీ జనాలు.
వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయాలని బీజేపీ సర్కారు నిర్ణయించింది. ఈ ఫ్యాక్టరీ కేవలం ఉద్యోగాలు కల్పించే సంస్థ మాత్రమే కాదు. అంతకన్నా ఎక్కువ అనుబంధం ఏపీ ప్రజలకు ఉంది. ఈ కర్మాగారం ప్రైవేటు వాళ్ల చేతుల్లోకి వెళ్తే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ఫ్యాక్టరీపై బతుకుతున్న లక్షకు పైగా కుటుంబాలు ప్రమాదంలో పడనున్నాయి. అయినప్పటికీ.. అధికారంలో ఉన్న వైసీపీ, విపక్షంలో ఉన్న టీడీపీ కనీసం మాట కూడా మాట్లాడట్లేదు. మోడీపై పోరాటం సాగించడం అటుంచితే.. ఇది సరికాదనే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. దీంతో.. ఎప్పటి లాగా కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే ఈ ఫ్యాక్టరీ రక్షణ కోసం పోరాటం సాగిస్తున్నారు.
అటు కేంద్రం మాత్రం చకచకా పనులు చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పటికే టెండర్లు కూడా ఆహ్వానించింది. లీగల్ అడ్వైజర్లను కూడా నియమిస్తూ.. వేగంగా ప్రైవేటీకరణ పనులు చేస్తోంది. బేరం కుదిరితే వెను వెంటనే ఫ్యాక్టరీని కూడా అప్పగించేందుకు చర్యలు చేపడుతోంది. అయినా కూడా.. ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నాయి.
ఈ విషయంలో మాట మాట్లాడితే.. ఎక్కడ తమ పాత కేసులు తిరగ దోడుతారోనని జగన్, చంద్రబాబు భయపడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కారణంగానే.. రాష్ట్రానికి ఇంత పెద్ద నష్టం జరుగుతున్నా.. వారు నోరు మూసుకొని ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు ఏపీ బీజేపీ నేతలు మాత్రం.. తాము ప్రైవేటు పరం కానివ్వబోమని చెబుతూనే ఉన్నారు. అటు కేంద్రం మాత్రం తన పని తాను చేస్తోంది. ఇదంతా చూస్తుంటే.. స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీ రాజకీయ పార్టీలు చేతులు ఎత్తేసినట్టేనా? అనే డౌట్ ప్రజల్లో వ్యక్తమవుతోంది.