AP Assembly Session 2022: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ వైసీపీ నియంతలా వ్యవహరిస్తుందని టీడీపీ సభ్యులు ఆరోపించారు. సభా వ్యవహారాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం సహకరించడం లేదని పెదవి విరుస్తున్నారు. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా అధికార పార్టీ ఏకపక్షంగా పోతోందని దుయ్యబడుతున్నారు. గడిచిన మూడేళ్లలో వైసీపీ ఎన్నడు హుందాగా మెలగలేదని టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా ప్రతిపక్షాల గొంతు నొక్కడమే వైసీపీ ధ్యేయంగా కనిపిస్తుందన్నారు.

రాజ్యాంగబద్దంగా నియమితులైన గవర్నర్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఏజెంట్ గా పనిచేస్తూ ప్రతిపక్షాలను పట్టించుకోవడం లేదు. తాము చేసే నిరసనల గురించి ఏనాడు స్పందించడం లేదు. ప్రభుత్వం చేసే దురాగాతాలను ఎండగట్టే క్రమంలో గవర్నర్ చొరవ చూపాల్సి ఉన్నా ఆయన ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగానే చూస్తున్నారని తెలుస్తోంది.
సభ నిర్వహణ ప్రారంభం రోజే టీడీపీ సభ్యులకు నిరాశ మిగిలింది. సభలో ప్రభుత్వ విధానాలను నిలదీయాలని భావించినా ఆ భాగ్యం కలగలేదు. సభకు అధినేత చంద్రబాబు హాజరు కాకపోయినా తమ గళం విప్పి ప్రభుత్వంతో పోరాడతామని వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేల ఆశ తీరలేదు. ఫలితంగా వైసీపీ ప్రభుత్వం తీరును నిరసిస్తున్నారు.

రాబోయే రోజుల్లో కూడా వైసీపీ ప్రవర్తన ఇలాగే ఉంటే తాము సభలో ఎలా మాట్లాడాలని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు లేకపోయినా తమను గౌరవించాల్సిందిపోయి నిందిస్తోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో శాసనసభ తీరుపై విమర్శలే వస్తున్నాయి. సభలో హుందాగా వ్యవహరించాల్సిన వైసీపీ సభ్యులు అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఎదుటి వారిని దూషించడం దారుణం. ఏదిఏమైనా సభా నిర్వహణ విషయంలో వైసీపీ తీరులో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.