తెలంగాణాలో దిశ తరహాలో మరో ఘటన జరిగింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడిపల్లిలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లుగా తెలుస్తుంది. మంగళవారం ఉదయం తంగడిపల్లి శివారులో ఓ బ్రిడ్జి కింద ఓ గుర్తు తెలియని 30 ఏళ్ళ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం బండరాయితో ఆమె తలపైన బాదడం వంటి ఆనవాళ్లు ఉండడంతో అత్యాచారం చేసి ఆ తరువాత హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఇక ఆ మహిళ దుస్తుల జాడ ఇంకా ఎలాంటి క్లూ కనపడక పోవడంతో పోలీసులకు నిందితులను పట్టుకోవడం సవాలుగా మారింది. కాగా చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇక కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.