Smart Cities: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్ఐసీడీపీ) కింద 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం లభించింది. ఇందులో దేశంలోని 10 రాష్ట్రాల్లో 12 ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద తెలిపింది. ఏపీ, తెలంగాణ, బిహార్, పంజాబ్, యూపీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కేరళలో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం రూ.28,602 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 10 లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 30 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ కారిడార్లను ఏపీలోని ఓర్వకల్లు-కొప్పర్తి, తెలంగాణలోని జహీరాబాద్, రాజస్థాన్లోని జోధ్పుర్-పాలి, ఉత్తరాఖండ్లోని ఖుర్పియా, పంజాబ్లోని రాజ్పురా-పాటియాలా, మహారాష్ట్రలోని దిఘి, కేరళలోని పాలక్కడ్, యూపీలోని ఆగ్రా-ప్రయాగ్రాజ్, బిహార్లోని గయలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు.
రూ.1.52 లక్షల కోట్ల పెట్టుబడులు..
కొత్తగా ఏర్పాటు చేసే 12 ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీలు దాదాపు రూ.1.52 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. తెలంగాణలోని జహారాబాద్లో స్మార్ట్సిటీని ఏర్పాటు చేయడంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని జహీరాబాద్లో 3245 ఎకరాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు కానుంది. ఇందుకు రూ.2,786 కోట్లు కేటాయించారు. కడప జిల్లా కొప్పర్తి లో పారిశ్రామిక హబ్ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేస్తారు. ఇందుకు రూ.2,137 కోట్లను ఖర్చు చేస్తారు.
ప్రయోజనం ఇలా..
ఈ పారిశ్రామిక నగరాలు 6 ప్రధాన కారిడార్లకు దగ్గరగా వ్యూహాత్మకంగా రూపొందించబడ్డాయి. ఈ ప్రాజెక్టులు భారతదేశం ఉత్పాదక సామర్థ్యాలను, ఆర్థిక వృద్ధిని పెంచడంలో ముఖ్యమైన చొరవను సూచిస్తాయి. ఈ చర్య దేశ పారిశ్రామిక దృశ్యాన్ని మారుస్తుంది. ఇది పారిశ్రామిక మండలాలు,యు నగరాల బలమైన నెట్వర్క్ను సృష్టిస్తుంది, ఇది ఆర్థిక వృద్ధిని, ప్రపంచ పోటీతత్వాన్ని గణనీయంగా పెంచుతుంది. ఎంపిక చేసిన నగరాలను ప్రపంచ ప్రమాణాలతో కూడిన కొత్త స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తారు. ప్రపంచ ప్రమాణాలతో కూడిన కొత్త స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చెందుతాయి. ఈ నగరాలు స్థిరమైన, సమర్థవంతమైన పారిశ్రామిక కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే అధునాతన మౌలిక సదుపాయాలను కలిగి ఉంటాయి.
ఇప్పటికే 8 నగరాలు..
ఇదిలా ఉంటే దేవంలో అలాంటి ఎనిమిది పారిశ్రామిక నగరాలు ఇప్పటికే వివిధ దశల్లో అమలులో ఉన్నాయి. పరిశ్రమల కోసం భూమి కేటాయింపు పనులు నాలుగు నగరాల్లో కొనసాగుతున్నాయి. ధొలేరా(గుజరాత్), ఆరిక్(మహారాష్ట్ర), విక్రమ్ ఉద్యోగపురి(మధ్యప్రదేశ్), కృష్ణపట్నం(ఆంధ్రప్రదేశ్). ప్రభుత్వం స్పెషల్ పర్పస్ వెహికల్ ఇతర నాలుగు నగరాల్లో రోడ్డు కనెక్టివిటీ, నీరు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాలను సృష్టించే ప్రక్రియలో ఉంది.