తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా.. విద్యాసంస్థలను మూసేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బుధవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో.. సినిమా హాళ్లు కూడా మూసేస్తారేమో అనే చర్చ బయలుదేరింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ స్పందించారు. సినిమా థియేటర్ల మూసివేత అనేది ఉండదని యథావిధిగా నడుస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి ఓ వీడియోలో ప్రకటించారు. అదేవిధంగా సీట్ల ఆక్యుపెన్సీ విషయంలో కూడా ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న కొవిడ్ నిబంధనల ప్రకారమే థియేటర్లు నడుస్తాయని తెలిపారు. థియేటర్లు మళ్లీ మూసేస్తే.. చిత్ర పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లుతుందని మంత్రి తలసాని చెప్పారు.