Pandu Master Accident: ప్రముఖ కొరియోగ్రాఫర్, ఢీ జోడి ఫేమ్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖ జిల్లా తగరపువలస సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఓ ప్రోగ్రాం నుంచి వస్తుండగా.. ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో బాధపడుతుండగా వాహనాన్ని పక్కకు తీసి ఆపారు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ వ్యాన్ ఢీ కొట్టడంతో ఆయన ప్రయాణించిన కారు.. ఆయనపై దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో పండు మాస్టర్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన పోలీసులు విశాఖ నగరంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. అయితే పండు మాస్టర్ ప్రమాదంపై అభిమానులు ఆందోళనతో ఉన్నారు. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం తరఫున సహాయం అందించేందుకు సిద్ధపడింది.
* డి ప్రోగ్రాం తో సుపరిచితం..
ఈటీవీ ఢీ ప్రోగ్రాం ద్వారా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు పండు మాస్టర్. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నారు. బుల్లితెరలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అటు కొరియోగ్రాఫర్ గా రాణిస్తూనే.. ఇటు ఈవెంట్లు చేసుకుంటూ తెలుగు ప్రజలకు ఎంతో దగ్గరయ్యారు. ఒకవైపు ఆర్టిస్ట్ గాను రాణిస్తున్నారు. మధ్య మధ్యలో బుల్లితెర ఈవెంట్లకు హాజరవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పండు మాస్టర్ సొంతం. అటువంటి పండు మాస్టర్ ప్రమాదానికి గురయ్యారని తెలుసుకొని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
* స్పందించిన టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు..
పండు మాస్టర్ విశాఖలోని గాజువాక ప్రాంతానికి చెందినవారు. దీంతో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ప్రభుత్వపరంగా వైద్యానికి అందించే సాయం చేస్తామని చెప్పుకొచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు శ్రీనివాస్. అయితే ఒక ప్రఖ్యాత కళాకారుడిగా తనకంటూ మంచి ఫేమ్ సొంతం చేసుకున్నారు పండు మాస్టర్. అందుకే అటువంటి కళాకారుడి కోసం ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. అయితే ఉదయం నుంచి పండు మాస్టర్ ఆరోగ్యం పై వదంతులు వచ్చాయి. అయితే ఆయనకు ప్రమాదం ఏమీ లేదని.. ఆపరేషన్ తరువాత కోలుకునే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.
