కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు కుదుట పడ్డాయి. అన్ని రంగాలూ తమ పనిలో తాము బిజీ అయిపోయాయి. కానీ.. సినిమా రంగం మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉందో కూడా అర్థం కావట్లేదు. దాన్ని తెలుసుకునేందుకు పైలట్ ప్రాజెక్టులుగా విడుదలయ్యాయి రెండు చిత్రాలు. అందులో ‘తిమ్మరుసు’ ఒకటి కాగా.. రెండోది ‘ఇష్క్’.
చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తేజ.. హీరోగా మారిపోయాడు. ‘ఓ బేబీ’ చిత్రంలో ఓ రోల్ ప్లే చేసిన తేజ.. ఆ తర్వాత ‘జాంబిరెడ్డి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు ప్రేక్షకులకు మొదటి సారిగా జాంబీలను పరిచయం చేసిన ఈ చిత్రం.. మంచి సక్సెస్ నే అందుకుంది. ఆ తర్వాత వచ్చిన తేజా మూవీ ఇష్క్. ఈ శుక్రవారం రిలీజైంది. ఓటీటీ ఆఫర్స్ ను కాదనుకొని, థియేటర్లలోనే రిలీజ్ చేసిన ఈ చిత్రం కలెక్షన్స్ నామమాత్రంగానే ఉండడం యూనిట్ ను కలవరానికి గురిచేస్తోంది.
కరోనా భయం ఇంకా కొనసాగుతూనే ఉండడం.. థర్డ్ వేవ్ హెచ్చరికలు వినిపిస్తున్న నేపథ్యంలో.. థియేటర్లకు రావడానికి జనాలు ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో మాత్రమే థియేటర్లకు అడ్డంకులు లేవు. ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీ నిబంధన అమల్లో ఉంది. నైట్ కర్ఫ్యూను ఆగస్టు 14వరకు పొడిగించడంతో నైట్ షోలు లేవు. పైగా.. సినిమా టికెట్ రేట్ల విషయంలో ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం కూడా ఇబ్బందిగా మారింది.
ఇన్ని డ్రా బ్యాక్స్ మధ్య విడుదలైన ఇష్క్ మూవీ.. తొలి రోజు మొత్తం 25 లక్షల మేర మాత్రమే కలెక్షన్స్ సాధించినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అఫీషియల్ లెక్కలు వస్తే.. కాస్త పెరుగుతాయేమో. కానీ.. ఓవరాల్ గా ఈ కలెక్షన్స్ చాలా తక్కువేనని చెప్పాలి. ఈ చిత్రానికి సంబంధించి 2.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని అంచనా. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 3 కోట్లు రాబట్టాల్సి ఉంది. మరి, ఈ మూవీకి వచ్చిన రివ్యూలు, కరోనా పరిస్థితులను బట్టి ఏ మేరకు కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.