Hero Navadeep: 2004 లో వచ్చిన “జై” చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చాడు హీరో నవదీప్. ఆ తర్వాత హీరోగా ఆయన నటింఛిన సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరింకలేకపోయాయి. దీంతో ప్రస్తుతం సినిమాల్లో ప్రముఖ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ మద్య కాలంలో సినిమాలకు కొంత దూరంగా ఉంటున్న నవదీప్ సోషల్ మీడియా లో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటున్నాడు. కాగా ప్రస్తుతం సినీ పరిశ్రమలో టికెట్ రేట్ల విషయంలో ఏపీ గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరు గురించి సినిమా ప్రముఖుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై స్టార్ హీరో చిరంజీవి, బడా నిర్మాత సురేష్ బాబు, తాజాగా బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు స్పందించి అన్ని సినిమాలకూ ఒకే టికెట్ రేట్ పెట్టడం సరికాదని, దానివల్ల పెద్ద సినిమాలు నష్టపోతాయని తెలిపారు. ప్రభుత్వం తమ నిర్ణయం గురించి మరోసారి పునరాలోచించాలని వారు కోరారు.

ఇప్పుడు తాజాగా యంగ్ హీరో నవదీప్ ఈ విషయంలో ఏపీ గవర్నమెంట్ పై ‘టమాట’ సెటైర్ వేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా “సినిమా టిక్కెట్ వర్సెస్ టమాట” అని ట్వీట్ చేశాడు నవదీప్. సినిమా టిక్కెట్ల ధరలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం భారీ బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలకు ఒకే టికెట్ ధర ఉంటుంది. మరోవైపు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సరఫరా కొరత కారణంగా టమాట ధరలు పెరుగుతున్నాయి. ఈ రెండు అంశాలను పోల్చిన నవదీప్ ఏపీలో కిలో టమాట ధర కంటే ఒక్క సినిమా టిక్కెట్ ధర తక్కువని పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు విసిరాడని అర్థమవుతుంది. ఈ ‘టమోటా’ సెటైర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.