Director Karuna Kumar: పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాలతో కెరీర్ ఆరంభంలోనే మంచి ఐటి లను సొంతం చేసుకున్నాడు దర్శకుడు కరుణకుమార్. కాగా తాజాగా ఆయన డైరెక్షన్లో మరో చిత్రం పట్టాలెక్కనుంది. విభిన్న కథా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రియదర్శి, అంజలి, రావురమేశ్ కీలకపాత్రలు పోషించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ 2 బ్యానర్పై బన్నీవాసు, విద్యామాధురి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు అల్లు అరవింద్, ఆయన పెద్ద కుమారుడు బాబీ పాల్గొని టీమ్కి అభినందనలు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం తెలిపింది. ఇటీవల కరుణ కుమార్ దర్శకత్వం వహించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుందని చెప్పాలి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటించాడు. ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. కులాల మధ్య నలిగిపోయి విడిపోయే ప్రేమ కథతో ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కాగా ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించింది.
మరోవైపు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఇటీవల నిర్మించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతూ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో అక్కినేని నాగార్జున నట వారసుడు అఖిల్ హీరోగా , పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకుడుగా చేశారు.