Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi : ఏపీ రాజకీయాలపై తొలిసారి స్పందించిన చిరంజీవి.. షాకింగ్ కామెంట్స్

Chiranjeevi : ఏపీ రాజకీయాలపై తొలిసారి స్పందించిన చిరంజీవి.. షాకింగ్ కామెంట్స్

Chiranjeevi : సినీ రంగంలో మకుటం లేని మహారాజు చిరంజీవి. ఎటువంటి నేపథ్యం లేకున్నా.. సినీ పరిశ్రమలో ప్రవేశించిమెగాస్టార్ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఆయన. ఇప్పుడు మెగా కాంపౌండ్ వాల్ నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారు. వారందరికీ దిక్సూచి, ప్లాట్ ఫామ్ వేసిన ఘనత మాత్రం చిరంజీవిదే. అటువంటి మెగాస్టార్ రాజకీయాల్లోకి వచ్చి అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. రాజకీయ రంగం నుంచి తిరిగి సినీ రంగానికి వెళ్లిపోయారు. తనకు రాజకీయాలు సూట్ కావని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు ఏపీఎన్నికలవేళ చిరంజీవి రాజకీయ ప్రకటన చేయడం విశేషం.మొన్నటికి మొన్న జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన చిరంజీవి.. ఇప్పుడు ఏకంగా ఎన్డీఏ పక్షాలకు మద్దతుగా కీలక ప్రకటన చేయడం విశేషం.

టిడిపి, జనసేన, బిజెపి కూటమి కట్టిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. మరోవైపు ప్రచార పర్వం కూడా ఊపందుకుంది. ఈ తరుణంలో చిరంజీవి చర్యలు ఎన్డీఏ భాగస్వామి పక్షాలకు అనుకూలంగా ఉన్నాయి. మొన్నటికి మొన్న జనసేనకు ఐదు కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం ద్వారా తన అభిమానులకు స్పష్టమైన సంకేతాలు పంపారు. నిన్నటికి నిన్న చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏకంగా ఎన్డీఏ అభ్యర్థులకుఓటు వేయాలని అభిమానులకు సూచించడం గమనార్హం.

వాస్తవానికి చిరంజీవిని బిజెపిలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరిగాయి.ప్రధాని మోదీ ఈ విషయంలో ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ఆయనను బిజెపిలో చేర్చుకొని ఏపీలో పార్టీ అభివృద్ధి చేయాలని తలిచారు. సినీ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు ఈ విషయంపై చిరంజీవితో మాట్లాడారు. కానీ చిరంజీవి సమ్మతించలేదు. ఆ మధ్యన అల్లూరి విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాని మోదీ చిరంజీవి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పక్కనే సీఎం జగన్ ఉన్నా చిరంజీవికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. బిజెపిలోకి ఆహ్వానించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ రాజకీయాల వైపు చూడకూడదని చిరంజీవి స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నారు.

అయితే తాజాగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు చిరంజీవిని ప్రత్యేకంగా కలిశారు. ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం రమేష్ మంచి వ్యక్తి అని.. తనకు అత్యంత సన్నిహితుడని.. కేంద్రంతో సత్సంబంధాలు ఉండడంతో అటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని అనకాపల్లి నియోజకవర్గ ప్రజలను చిరంజీవి కోరారు. పంచకర్ల రమేష్ బాబు సైతం ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారని.. మంచి వ్యక్తి.. సమర్ధుడైన నేతగా పేరు తెచ్చుకున్నారని అభినందించారు. ఇటువంటి నాయకులను ఎన్నుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందని చిరంజీవి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిగా ఏర్పడడం శుభపరిణామంగా చెప్పుకొచ్చారు. మొత్తానికైతే రాజకీయాలపై ఆసక్తి లేదంటూనే.. చిరంజీవి రాష్ట్ర ప్రజలతో పాటు మెగా అభిమానులకు స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు. తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular