AP Group 1 Results: ఆంధ్రప్రదేశ్లో 111 గ్రూప్–1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను ఏపీపీఎస్సీ(ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) గురువారం విడుదల చేసింది. ఈ ఫలితాల వివరాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. మొత్తం 111 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను నిర్దేశిత తేదీల్లో ఏపీపీఎస్సీ నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 11 నెలల వ్యవధిలోనే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి రికార్డు సృష్టించింది.
ఆఫీసర్లుగా అన్నమ్ములు..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 ఫలితాల్లో అన్నదమ్ములు సత్తా చాటారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పోలుమహంతి ఉమామహేశ్వరరావు బీసీ సంక్షేమశాఖలో పని చేసి రిటైరయ్యారు. తల్లి సాయి సుజాత స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దంపతుల ఇద్దరు కుమారులు గ్రూప్–1 ఫలితాల్లో ఒకేసారి ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు వెంకట సాయిరాజేష్ అగ్నిమాపక అధికారిగా పని చేస్తుండగా.. చిన్న కుమారుడు వెంకట సాయిమనోజ్ వైద్యారోగ్యశాఖలో పరిపాలనాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. అన్నదమ్ములిద్దరు బీటెక్ పూర్తి చేశారు.. ఏడేళ్ల నుంచి ఢిల్లీలో సివిల్స్ శిక్షణలో ఉన్నారు.
తొలి ప్రయత్నంలోనే స్టేట్ ఫస్ట్..
మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలికి భాను శ్రీలక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష గ్రూపు–1 తొలి ప్రయత్నంలోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆమె తండ్రి వెంకట రామాంజనేయులు భీమవరం డీఈవో కార్యాలయంలో ఏపీవోగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి ఉష గృహిణి.. వీరికి ప్రత్యూష ఒక్కరే కుమార్తె. ఈమె ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చారు.. ఢిల్లీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనమిక్స్లో డిగ్రీ చేశారు. ప్రస్తుతం సివిల్స్ మెయిన్స్కు సిద్ధమవుతున్నారు ప్రత్యూష.
అధ్యాపకురాలికి 2వ ర్యాంకు..
ఇక గ్రూప్–1 ఫలితాల్లో కడప జిల్లా మైదుకూరుకు చెందిన పావని గ్రూప్–1లో రెండో ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. రైతు కుటుంబం నుంచి వచ్చి పావని.. బీటెక్ ఈసీఈ పూర్తి చేసి కర్నూలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కాంట్రాక్ట్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె డిప్యూటీ కలెక్టర్గా ఎంపికకావడంతో తల్లిదండ్రులు లక్ష్మీదేవి, గంగయ్య ఆనందానికి అవధులు లేవు.
కండక్టర్ కూతురుకు 3వ ర్యాంకు..
అన్నమయ్య జిల్లా నందలూరు మండలం టంగుటూరుకు చెందిన లక్ష్మీప్రసన్న గ్రూప్–1 ఫలితాల్లో సత్తా చాటారు. ఆమె మూడో ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. ఆమె తండ్రి సుబ్బరాయుడు రాజంపేట ఆర్టీసీలో కండక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు చేశారు. ఆమె తల్లి సరస్వతి గృహిణి. ఈ దంపతుల మూడో కుమార్తె ప్రసన్న. ఆమె గతంలో మూడుసార్లు సివిల్స్కు ప్రయత్నించారు.. 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం టంగుటూరులో పనిచేస్తున్నారు. ఈమె ఇద్దరు సోదరీమణులు గ్రూప్–1 ఉద్యోగులు కావడం విశేషం.
మొత్తం 111 ఉద్యోగాల భర్తీకి ఎంపిక చేసిన వారిలో 33 మంది మహిళలు ఎంపిక కావడం విశేషం. 111 ఉద్యోగాల్లో ఒక పోస్టును స్పోర్ట్స్ కోటాలో భర్తీపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ 111 పోస్టుల్లో రాష్ట్ర కేడర్కు చెందిన డిప్యూటీ కలెక్టర్ 13, సీటీఓ–13, డీఎస్పీ (సివిల్) 13, డీఎస్పీ (జైళ్లు) 2, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్–2, ఏటీఓ (టీ అండ్ ఏ సర్వీస్) పోస్టులు 11 ఉన్నాయి. డీఎస్పీ (జైళ్లు), డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ పోస్టుల మినహా మిగిలిన పోస్టులకు ఎంపికైన వారిలో 14 మంది మహిళలు ఉన్నారు.