Daivalaguda Raj Kumar: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ప్రాంతంలో ఆరుగురుని హత్య చేసిన రాజ్ కుమార్ నేపథ్యం చాలా క్రూరంగా ఉంది. ఈ హత్యలు జరిగిన తర్వాత.. అతడి గురించి పోలీసులు దర్యాప్తు జరుపుతుంటే దారుణమైన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.. రాజ్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఆమెను నిత్యం వేధిస్తుండేవాడు. ఇద్దరు మగ పిల్లలు పుట్టినప్పటికీ.. వారి ఆలనా పాలనా అతడు చూసుకునేవాడు కాదు. పైగా అమ్మాయిలు అంటే పిచ్చిగా వ్యవహరించేవాడు.
రాజ్ కుమార్ ప్రేమిస్తున్నానని చెబితే సరిత నిజమని నమ్మింది. అతడితో ఏడడుగులు వేసింది. ఆ తర్వాత అతడి అసలు స్వరూపాన్ని చూసి ప్రతిరోజు ఏడ్చేది. ఇద్దరు పిల్లలు పుట్టినప్పటికీ రాజ్ కుమార్ తన ప్రవర్తన మానుకోలేదు. చివరికి తన కుమారుడు ఇటీవల రింగ్ మింగాడు. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయినప్పటికీ రాజ్ కుమార్ తన కుమారుడిని పట్టించుకోలేదు. అతడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆసుపత్రికి తీసుకెళ్లలేదు.
మొదటి నుంచి కూడా రాజ్ కుమార్ దైవాలగూడ .. ఇతర ప్రాంతాలలో అమ్మాయిలను వేధించే వాడట. ఇదే విషయాన్ని అతడి సొంత కుటుంబ సభ్యుల చెబుతున్నారు. వివాహ విషయంలో కూడా అనేక గొడవలు జరిగినట్టు సమాచారం. రాజ్ కుమార్ భార్య సరితకు గతంలో వేరే సంబంధం వచ్చింది. ఆ సంబంధాన్ని రాజ్ కుమార్ చెడగొట్టాడు. ప్రేమించినట్టు చెప్పి.. ఆమె వెంటపడ్డాడు. వేధించాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి .. సరితను లొంగదీసుకున్నాడు. ఆమెను బెదిరించి పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన తర్వాత సరితను అతడు నిత్యం వేధించేవాడు. అందంగా లేవని.. శరీర సౌష్టవం బాగోలేదని ఇబ్బంది పెట్టేవాడు. అనేక పర్యాయాలు గొడవలు జరిగాయి. ఆ సమయంలో సరితని విడాకులు తీసుకుని రావాలని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే తన భర్త మారతాడని సరిత భావించింది. కానీ అతడు సరితను.. ఆమె ఇద్దరు పిల్లల్ని చంపేశాడు.
ఫోక్సో కేసు పెట్టిన బాలిక.. ఆమె తల్లి.. నానమ్మ… తో రాజ్ కుమార్ స్నేహంగానే ఉండేవాడు. ఆ బాలిక తండ్రి తో స్నేహాని కొనసాగించేవాడు. అయితే ఆ బాలికతో రాజ్ కుమార్ అనేక సందర్భాల్లో వంకర బుద్ధితో మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో అతడి తీరును ఆ బాలిక తండ్రి అనేక సందర్భాల్లో తప్పుపట్టాడు. అంతేకాదు ఇటీవల ఆ బాలిక ఇంటి పెద్ద చనిపోయాడు. మద్యం తాగే అలవాటు ఉన్న నేపథ్యంలో అతడు చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత రాజ్ కుమార్ అతను చనిపోవడానికి కారణమని వారు అనుమానం వ్యక్తం చేశారు.. ఆ ఇంటి పెద్ద చనిపోయిన తర్వాత రాజ్ కుమార్ తరచూ అక్కడికి వెళ్లేవాడు. ఆ బాలికతో దారుణంగా ప్రవర్తించేవాడు. తమ ఇంటికి రావద్దని ఆ బాలిక కుటుంబం అతడి ముఖం మీద చెప్పేసింది.
ఈ నేపథ్యంలో ఆ బాలిక ఇంటిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు తన ఫోన్ కనెక్ట్ చేసుకున్నాడు రాజ్ కుమార్. ప్రతి విషయం మీద కూడా అతడు ఆరా తీసేవాడు. ఇంట్లోకి ఎవరు వస్తున్నారో నిత్యం గమనించేవాడు. ఇదంతా భరించలేక వారు ఆ బాలికను కాలేజీ మాన్పించారు. పరీక్షలు జరుగుతున్నప్పుడు ఆ బాలికను కాలేజీ వద్దకు తీసుకెళ్లేవారు. ఈ విషయం తెలుసుకున్న రాజ్ కుమార్.. ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. కాలేజీ మానేయాలని కోరాడు. ఆమె చేయి పట్టుకుని లాగాడు. ఆ సమయంలో ఆ బాలిక తల్లి రాజ్ కుమార్ ను తిట్టింది.
ఆ బాలిక కాలేజీకి వెళ్తున్నప్పుడు రాజ్ కుమార్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. అదే సమయంలో మీ ఇంటి పెద్దను చంపినట్టే.. మీ అందరిని కూడా అంతం చేసి ఆ బాలికను తీసుకుపోతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ సమయంలో ఆ బాలిక కుటుంబ సభ్యులకు.. తమ ఇంటి పెద్దను రాజ్ కుమార్ హత్య చేశాడని తెలుసుకొని ఒకసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో వారు రాజ్ కుమార్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతని మీద ఫోక్సొ కేసు పెట్టారు. అప్పటి నుంచి రాజ్ కుమార్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు అయిన నాటి నుంచి పరారీలో ఉన్న రాజ్ కుమార్.. బెయిల్ కోసం విపరీతంగా ప్రయత్నించాడు. చివరికి బేల్ రావడంతో సరిగా 15 రోజుల క్రితం సొంత ఊరికి వచ్చాడు. వచ్చిన నాటి నుంచి నిశ్శబ్దంగా ఉన్నాడు. సొంత కుమారుడు రింగు మింగినప్పటికీ.. ఆస్పత్రికి తీసుకెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. చివరికి ఆరుగురిని చంపేసి.. తన క్రూరత్వాన్ని బయట పెట్టుకున్నాడు.
