సాధారణంగా ఒక మామిడి పండు ధర ప్రాంతాన్ని బట్టి 5 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పలుకుతుంది. అయితే మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో పండే ‘నూర్జహాన్’ మామిడి పండ్లు మాత్రం ఒక్కొక్కటి 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు పలుకుతాయి. విపరీతమైన డిమాండ్ ఉండే ఈ పండ్లు సాధారణ మామిడి పండ్లతో పోలిస్తే ఎంతో రుచిగా ఉంటాయని సమాచారం అందుతోంది.
గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మామిడి పండ్ల పరిమాణం కూడా ఎక్కువగా ఉండటంతో మంచి ధర పలుకుతుందని ఈ పండ్లను పండించిన రైతు చెబుతున్నాడు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల ఈ సంవత్సరం రైతుకు దిగుబడి పెరిగిందని తెలుస్తోంది. ఆప్ఘాన్ మూలానికి చెందిన నూర్జహాన్ మామిడి పండ్లను అలీరాజ్పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతంలో మాత్రమే పండిస్తారు.
ఇండోర్కు దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో గుజరాత్ సరిహద్దుకు ఆనుకుని ఉండే ఈ ప్రాంతంలో ఒక్కో చెట్టుకు 250 పండ్లు మాత్రమే కాస్తాయని సమాచారం. రైతు శివరాజ్ సింగ్ జాదవ్ ఈ పండ్లను ఇష్టపడే వాళ్లు ఈ పండ్ల కోసం ముందుగానే ఆర్డర్ పెడతారని చెబుతున్నారు. నూర్జహాన్ మామిడిపండ్ల బరువు 2 నుంచి మూడున్నర కేజీల వరకు ఉంటుందని తెలుస్తోంది.
మరో రైతు ఇషాక్ మన్సూరీ మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రభావం వ్యాపారంపై పడిందని తెలిపారు. దిగుబడి బాగున్నా ఈ సంవత్సరం నష్టాలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. 2019 సంవత్సరంలో ఒక్కో మామిడి పండు ఏకంగా 1,200 రూపాయలు పలికిందని ఇషాక్ మన్సూరీ చెప్పుకొచ్చారు.