రాష్ట్రంలో మద్యం ధరను పన్నుల రూపంలో 25 శాతం మేరకు పెంచిన సంగతి తెలిసిందే. ధరలు పెంచినప్పటికీ, షాపుల ముందు భారీ ఎత్తున క్యూలైన్లు కనిపించడం, భౌతిక దూరం పాటించకుండా, జనాలు తోసుకోవడంపై సమీక్షించిన జగన్, మద్యం ధరలను మరింతగా పెంచడం ద్వారా ప్రజలను వైన్ షాపులకు దూరం చేయాలని నిర్ణయించారు. దీంతో మరో 50 శాతం మేరకు ధరలను పెంచాలని సీఎం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ధరలను పెంచామని వెల్లడించిన స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ్, పెరిగిన కొత్త ధరలతో ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. కాగా ఈ నెలాఖరులోగా 15 శాతం మద్యం దుకాణాలను మూసివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ధరల పెంపుపై విమర్శలను ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు ఇవాళ ఉదయం మద్యం షాపులు తెరుచుకోలేదు. మద్యం అమ్మకాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉదయమే ఓ ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది. అమ్మకాలు మళ్లీ ఎప్పట్నుంచి ప్రారంభించాలనే దానిపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేయాలని కమిషనర్ తెలిపారు. మద్యం షాపుల వద్ద రద్దీని తగ్గించడం, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంపై దృష్టిపెట్టాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయించింది. రద్దీని తగ్గించేందుకు టోకెన్ పద్ధతిని అమలు చేసే అంశంపై పరిశీలించారు. వీటితో పాటు ఇతర రాష్ట్రాల్లో 50 నుంచి 70 శాతం వరకు మద్యం ధరలు పెంచారని పలువరు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అన్ని అంశాలను పరిశీలించి ఫైనల్గా మార్గదర్శకాలను ఉదయం 11గంటలకు జారీ చేసింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను కేంద్రం ఆరా తీసింది. షాపుల వద్ద నిబంధనలు పాటిస్తుంది.. లేనిది తెలుసుకుంది. ఇతర రాష్ట్రాలలో మద్యం విక్రయాల తీరుపై కూడా కేంద్రం ఆరా తీసింది.