YS Jagan Mohan Reddy Mavigan: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )కొత్త రాజధాని ప్రతిపాదనపై ఇప్పుడు తెగ చర్చ నడుస్తోంది. మావిగన్ అనే పేరును ఆయన రాజధానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. మచిలీపట్నంలో MA తీసుకోండి.. విజయవాడలో VI తీసుకోండి.. గుంటూరులో GUN తీసుకోండి. మావిగన్ అని పేరు పెట్టుకోండి అంటూ జగన్మోహన్ రెడ్డి సూచించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ఈ ప్రతిపాదన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిపోయింది. అదో వింత పేరుతో పాటు విచిత్రమైన ఐడియా ఉండడంతో.. జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చిన ఆ మేధావి ఎవరు? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. సహజంగానే ఇటువంటి వాటికి స్క్రిప్టులు రాస్తుంటారు సజ్జల రామకృష్ణారెడ్డి. దీంతో అందరి చూపు ఆయన పైనే పడింది. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల విశ్లేషకులు సైతం సజ్జల వైపు అనుమానపు చూపులు చూశారు. దీంతో ఆయన మీడియా ముందుకు వచ్చి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
* కాస్త ఆందోళన గానే..
మీడియా సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి( sajjala Ramakrishna Reddy ) కాస్త ఆందోళనతోనే కనిపించారు. మావిగన్ ఐడియా నాది కాదు బాబోయ్ అంటూ తేల్చి చెప్పారు. విలేకరులు అదే పనిగా మావిగన్ పేరు ప్రస్తావిస్తుంటే తనకు తెలియదన్నట్టు దాని జోలికి పోలేదు. మరోవైపు జగన్ గారు ఎవరి సలహాలు అయినా తీసుకుంటారా? ఆయనకు ఎవరైనా ఉచిత సలహాలు ఇవ్వగలరా అంటూ బదులిచ్చారు. జగన్మోహన్ రెడ్డి తనంతట తానుగా తీసుకున్న బ్రహ్మాండమైన నిర్ణయం గా సమర్ధించుకున్నారు. అందులో తనకు క్రెడిట్ ఉండేలా ఇష్టపడలేదు సజ్జల వారు. సున్నితంగా ఈ అంశం నుంచి పక్కకు తప్పుకున్నట్టు అనిపించింది సజ్జల వ్యవహార శైలి.
* మొన్ననే చీవాట్లు అమరావతిలో( Amravati capital ) మొన్న మధ్యన ఒక కాంక్లేవ్ లో పాల్గొన్నారు సజ్జల. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే జగన్మోహన్ రెడ్డి పాలన ఉంటుందని చెప్పుకొచ్చారు. దానిపై జగన్ క్లాస్ పీకినట్లు కూడా ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు ఈ మావిగన్ గోల తన మెడకు చుట్టుకుంటుందన్న భయం ఆయనలో కనిపించింది. అందుకే జగన్మోహన్ రెడ్డిని ఒక తిరుగులేని నాయకుడిగా చూపిస్తూనే.. మావికం సలహాదారు బాధ్యత నుంచి తన పేరును రక్షించుకోవడానికి సకల ప్రయత్నాలు చేశారు సజ్జల వారు. అమరావతికి అడ్డుకట్ట వేయడానికి తెచ్చిన ఈ మావిగన్ ఐడియా ఇప్పుడు వైసీపీలో చిచ్చు రేపుతోంది. ఈ పేరుతో సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. అందుకే క్రెడిట్ ఆరాటపడడం లేదు వైయస్సార్సీపి నేతలు. ఆ క్రెడిట్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నారు.