Vijayamma: రాజశేఖర్ రెడ్డి బతికున్నంత వరకు వసుదైక కుటుంబం వారిది. మమతాను రాగాలు,ఆప్యాయతలతో గడిపేది ఆ కుటుంబం. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ కు అండగా నిలిచింది కూడా ఆ కుటుంబం.2014 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావాలని బలంగా ఆకాంక్షించింది కూడా ఆ కుటుంబం.2019లో అయితే ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కృషి చేశారు. చివరకు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సైతం అన్నకు మద్దతుగా ప్రచారం చేశారు.అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కుటుంబంలో అరమరికలు వచ్చాయి. జగన్ కు సోదరి షర్మిల దూరమయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం అంటూ.. కుమారుడు జగన్కు తాత్కాలిక గుడ్ బై చెప్పారు విజయమ్మ. కానీ ఈ ఎన్నికల్లో వైసీపీకి అపజయం వెనుక షర్మిల తో పాటు విజయమ్మ ఉన్నారన్న అపవాదును ఎదుర్కొన్నారు.
2019 వరకు కుమారుడుకు ఏకపక్షంగా మద్దతుగా నిలిచారు విజయమ్మ. కానీ కుటుంబ పరిస్థితుల్లో వచ్చిన మార్పుతో ఆమె విచిత్ర పరిస్థితులను ఎదుర్కొన్నారు. వ్యక్తిగత గొడవలతో పాటు వివేకానంద రెడ్డి హత్య విషయంలో తలెత్తిన విభేదాలతో షర్మిల సోదరుడికి దూరమయ్యారు. తెలంగాణలో రాజకీయాలు చేసేందుకు తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో తన అవసరం కుమారుడు జగన్ కంటే కుమార్తె షర్మిలకు ఉందని చెబుతూ.. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేశారు విజయమ్మ. తల్లిగా అండగా నిలబడినా షర్మిల తెలంగాణ రాజకీయాల్లో రాణించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు.
ఈ ఎన్నికల్లో కడప లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు షర్మిల. అదే సమయంలో జగన్ కు విజయమ్మ మద్దతు తెలుపుతారని అంతా భావించారు. కానీ తన ఇద్దరు పిల్లలకు సమర్థించలేక, వ్యతిరేకించలేక విదేశాలకు వెళ్లిపోయారు ఆమె. కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన షర్మిల రాష్ట్రవ్యాప్తంగా ప్రభావితం చేయగలిగారు. సోదరుడిపై వ్యతిరేక ప్రచారం చేయడం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అదే సమయంలో విజయమ్మ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా కడప నుంచి పోటీ చేస్తున్న షర్మిలకు మద్దతుగా నిలవాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ అదే సమయంలో కుమారుడు జగన్ కు మద్దతుగా ఒక్క మాట కూడా చెప్పలేదు. వైసిపి దారుణ పరాజయానికి విజయమ్మ పిలుపు కూడా ఒక కారణమని విశ్లేషణలు ఉన్నాయి. దీంతో దాదాపు విజయమ్మ జగన్ కు దూరమైనట్టేనని అందరూ అంచనాలు వేశారు.
ప్రస్తుతం కడప జిల్లాలో ఉన్నారు సీఎం జగన్. తండ్రి రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు నిన్ననే ఆయన కడప చేరుకున్నారు. అదే సమయంలో సోదరి షర్మిల సైతం ఇడుపులపాయలోనే ఉన్నారు. కానీ విజయమ్మ మాత్రం కుమారుడు జగన్, కోడలు భారతీ రెడ్డి తో కలిసి రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. తద్వారా తాను కుమారుడితో ఉన్నట్లు సంకేతాలు పంపారు. అయితే కుటుంబంలో పిల్లలు ఇద్దరినీ ఒక కొలిక్కి తేవడంలో మాత్రం విఫలమయ్యారు. అంబానీ కుటుంబంలో సోదరులు ఇద్దరు మధ్య ఇటువంటి వివాదాలు వచ్చాయి. కానీ తల్లి క్రియాశీలక పాత్ర పోషించి వారి మధ్య ఉన్న అరమరికలను తగ్గించారు. చాలా వరకు సమస్యలను పరిష్కరించారు. కానీ ఈ విషయంలో విజయమ్మ మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. కుమారుడు ఓటమికి కారణమన్న అపవాదును మూటగట్టుకున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More