Venkatarami Reddy joins YSRCP: ఏపీలో( Andhra Pradesh) ఒక విచిత్ర వాతావరణం నడిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. కానీ చాలామంది చదువుకున్న వారు, ఉద్యోగాలు చేస్తున్నవారు ముందుగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు చెబుతుంటారు. అయితే అది వారి వ్యక్తిగతం కానీ కొందరు ఉద్యోగులు బాహటంగానే నిబంధనలకు విరుద్ధంగా రాజకీయాలు చేస్తుంటారు. అటువంటి వారికి ఉద్యోగ సంఘం మాజీ నేత వెంకట్రామిరెడ్డి ఎపిసోడ్ చక్కటి ఉదాహరణ. ఆయనకి ఇంకా 15 సంవత్సరాల సర్వీస్ ఉంది. మంచి ఉద్యోగ జీవితం ఉండేది. కానీ దానిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పణంగా పెట్టారు వెంకట్రామిరెడ్డి. జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేయాలన్న కోణంలో ఉద్యోగ సంఘం నేత ముసుగులో ఆయన చేయని ప్రయత్నం లేదు. ఉద్యోగ నిబంధనల ప్రకారం ఆయన పై వేటు వేసింది కూటమి ప్రభుత్వం. ఉద్యోగిగా డిస్మిస్ అయిన ఆయనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి బెనిఫిట్స్ దక్కవు. అయితే ఆయనకు జగన్మోహన్ రెడ్డి ఏ రూపంలో సాయం చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న.
ఎంతోమందికి లైఫ్..
గతంలో చాలామంది ఉద్యోగులతో పాటు అధికారులకు పదవులు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ). వారు తమ ఉద్యోగాలకు స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత పార్టీలోకి రప్పించి ఎంపీ తో పాటు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. గెలిపించి చట్టసభలకు పంపించారు. ఇప్పుడు వెంకట్రామిరెడ్డి ని కూడా అలానే పొలిటికల్ గా ప్రోత్సహిస్తారా లేదా అనేది చూడాలి. కూటమి ప్రభుత్వం వెంకట్రామిరెడ్డి పై వేటు వేసినప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విపరీతమైన సానుభూతి వచ్చింది. నేతలు ఒక్కొక్కరు ఆయనకు సంఘీభావం చెబుతూ ట్వీట్లు పెట్టారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వారు అయితే వెంకట్రామిరెడ్డి కోసం న్యాయపోరాటం చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే న్యాయపోరాటానికి ఏళ్ల సమయం పడుతుంది. అదే పిలిచి వైసీపీలో ఏదో ఒక పదవి ఇస్తే ఆయన ఖుషి అవుతారు. గతానికి మించి పార్టీ కోసం పని చేస్తారు.
పూర్తిగా స్వేచ్ఛ..
ఒక విధంగా చెప్పాలంటే వెంకట్రామిరెడ్డికి ( Venkat Rama Reddy)కూటమి ప్రభుత్వం పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది. ఆయనకు స్వతంత్రత లభించింది. ఎందుకంటే ఉద్యోగ సంఘాల నేత ముసుగులో వైసీపీ కోసం ఆయన పని చేశారు. ఇప్పుడు నిజంగా వైసీపీలో తీసుకొని కీలక బాధ్యతలు కట్టబెడితే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే ఫైనల్. త్వరలో వెంకట్రామిరెడ్డికి వైసీపీలోకి రప్పించి కీలక పదవి కట్టబెట్టే ప్రయత్నాలు ఉన్నట్లు చర్చ నడుస్తోంది. మరి అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.