Uttarandhra Development: ఉత్తరాంధ్ర పై వెనుకబాటు ఒక అపవాదు ఉంది. విశాఖ జిల్లాను పక్కన పెడితే విజయనగరం తో పాటు శ్రీకాకుళం జిల్లా వెనుకబడి ఉన్నాయన్నది ఇప్పటివరకు ఉన్న ప్రచారం. అయితే దానికి చెక్ పడనుంది. ఉత్తరాంధ్ర అన్ని విధాల అభివృద్ధికి పునాది పడింది. వచ్చే నెలలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం చేయనున్నారు. మరోవైపు విశాఖ తో పాటు ఉత్తరాంధ్రకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ రాకతో.. ఐటీ అనుబంధ పరిశ్రమల చూపు విశాఖ వైపు ఉంది. కేవలం విశాఖ మాత్రమే కాదు విజయనగరం తో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ పరిశ్రమల విస్తరణకు అవకాశం ఉంది.
గేమ్ చేంజర్ గా ఎయిర్పోర్ట్..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్గా నిలవనుంది. అన్ని రంగాల అభివృద్ధికి ఇది దోహదం కానుంది. పైగా సువిశాల తీర ప్రాంతం ఉత్తరాంధ్ర సొంతం. పర్యాటకంగానూ చాలా కీలక ప్రాజెక్టులు నిర్మితం కానున్నాయి ఉత్తరాంధ్రలో. కేవలం ఉత్తరాంధ్ర మాత్రమే కాదు పక్కనే ఉన్న ఒడిస్సా, చత్తీస్గడ్ ప్రజలు సైతం భోగాపురం ఎయిర్పోర్ట్ మీదుగా రాకపోకలు సాగించనున్నారు. కచ్చితంగా ఇది విశాఖ తో పాటు ఉత్తరాంధ్రకు కలిసి వచ్చే అంశం. ఇతర రంగాల్లో కూడా అభివృద్ధి సాధిస్తే ఆదాయం భారీ స్థాయిలో సమకూరే అవకాశాలు ఉన్నాయి.
విశాఖ- రాయపూర్ నేషనల్ హైవే..
మరోవైపు విశాఖ- రాయపూర్ గ్రీన్ హైవే ఈ ఏడాది అందుబాటులోకి రానుంది. ఒడిస్సా తో పాటు చత్తీస్గడ్ వరకు 500 కిలోమీటర్ల మేర ఈ రహదారి దాదాపు నిర్మితమైంది. దీంతో ఉత్తరాది రాష్ట్రాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. ప్రధానంగా ఉత్తరాంధ్రలో తయారీ రంగ పరిశ్రమలతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మరింత అభివృద్ధి కానున్నాయి. శ్రీకాకుళంలో కొబ్బరి జీడి ఉత్పత్తులకు జాతీయస్థాయి మార్కెట్ కలగనుంది. వీటితో పాటు అటవీ ప్రాంతాల్లో లభించే అటవీ ఉత్పత్తులకు సైతం మార్కెట్ సదుపాయం రానుంది. రవాణా మరింత మెరుగు పడనుంది. రవాణా అందుబాటులోకి రావడంతో ఔత్సాహికులు పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. భారీగా పెట్టుబడులు కూడా పెడతారు.
మరో రెండేళ్లలో ఐటీ పరిశ్రమలు..
మరో రెండేళ్లలో గూగుల్ డేటా సెంటర్ నిర్మితం కానుంది. మరోవైపు రిలయన్స్ డేటా సెంటర్ సైతం ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ఐటి అనుబంధ పరిశ్రమలు కేవలం విశాఖకు మాత్రమే పరిమితం కావడం లేదు. విజయనగరం తో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇవి ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. కోస్టల్ క్యారీడార్ తో పాటు మూడో రైల్వే లైన్ నిర్మాణం కానుంది. ఇలా రవాణా పరంగా కనెక్టివిటీ పెంచుకుంటోంది ఉత్తరాంధ్ర. తద్వారా మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేయనుంది అన్నమాట.
