Jagan blessings controversy: ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మరో మూడేళ్ల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పటినుంచి ఎత్తుకు పైఎత్తులు కొనసాగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సైతం కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు. మరోవైపు చాలామంది అధికారులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీకి ఓ సీఐ బాహటంగానే మద్దతు ప్రకటించినట్టు ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉండగా ఆయనకు టీటీడీ అర్చకులు ప్రత్యేకంగా ఆశీర్వదించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. కనీసం అనుమతులు తీసుకోకుండా.. నిబంధనలకు విరుద్ధంగా.. రాజకీయ ప్రోత్సాహంతో అర్చకులు జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వచనం అందించడంపై టిటిడి సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది.
పులివెందులలో పర్యటన..
గత మూడు రోజులుగా జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. ఈ క్రమంలో చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా. మరో రెండు రోజుల్లో జగన్ కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. సిబిఐ కోర్టు కూడా ఆయనకు అనుమతి ఇచ్చింది. అందుకే అంతకుముందే పులివెందులలో పర్యటించాలనుకున్నారు జగన్. అయితే జగన్ పులివెందులలో ఉండగా టిటిడి అర్చకులు వెళ్లి ఆశీర్వచనం అందించడం విశేషం. ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు శ్రావణ్ కుమార్, వీణ మనోజ్ కుమార్, రాజంపేట మండలం బోయినపల్లి లోని వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది జగన్ నివాసానికి వెళ్లి మరి ఆశీర్వదించారు. టీటీడీ పరిపాలన అధికారుల నుంచి ముందస్తుగా ఎలాంటి అనుమతి కూడా తీసుకోలేదు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నేరుగా జగన్ ఇంటికి వెళ్లడాన్ని టిటిడి అధికారులు తప్పుపడుతున్నారు. అందుకే నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.
కనీస నిబంధనలు పాటించకుండా..
ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి టిటిడి అర్చకులు ఆశీర్వచనం ఇవ్వడంలో ఎలాంటి తప్పిదం లేదు. కానీ నేరుగా ఆయన ఇంటికి వెళ్లి.. టీటీడీ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా.. ఆపై ప్రత్యేక పర్వదినం కాకపోయినా.. ప్రత్యేక ఆసక్తితోనే అర్చకులు ఇలా చేశారని టిటిడి అధికారులు భావిస్తున్నారు. అందుకే సీరియస్ గా నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసుల జారీ తో వదిలేస్తారా? లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటారా? అన్నది చూడాలి.