TDP: బీసీలు అంటే ముందుగా గుర్తొచ్చే పార్టీ తెలుగుదేశం. బీసీల పార్టీగా టిడిపి పై బలమైన ముద్ర ఉంది. దానికి కారణం లేకపోలేదు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన నాటి నుంచి బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేశారు. రాజకీయ, సామాజిక, ఆర్థికంగా పెద్దపీట వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వందలాదిమంది బీసీ నాయకులకు బలమైన నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. అప్పటివరకు సంప్రదాయ అగ్రవర్ణాలు మాత్రమే రాజకీయ అవకాశాలు దక్కించుకునేవి. కానీ టిడిపి వచ్చిన తర్వాత వందలాదిమందికి రాజకీయ అవకాశాలు వచ్చాయి. ఒక దేవేందర్ గౌడ్, ఒక ఎర్రం నాయుడు, ఒక అయ్యన్నపాత్రుడు, ఒక కళా వెంకట్రావు, ఒక కేఈ కృష్ణమూర్తి.. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. చంద్రబాబు సైతం బీసీ నేతలకు అంతే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఇప్పుడు వెనుకబడిన వర్గాల్లో అత్యంత వెనుకబాటుకు గురైన వడ్డేరా కులానికి చెందిన ఒక మహిళకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు. నిజంగా ఇది గొప్ప పరిణామం.
* సాధారణ కార్యకర్తకు ఎమ్మెల్సీ పదవి..
సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్న చంద్రబాబు సర్కార్.. అత్యంత వెనుకబడిన వర్గంగా ఉన్న వడ్డెర సామాజిక వర్గానికి చెందిన సాధారణ కార్యకర్త దళవాయి రమాదేవికి ఎమ్మెల్సీ పదవి ప్రకటించింది. అయితే ఇది కేవలం ఒక పదవి కాదు. వెనుకబడిన వర్గాల సాధికారిత. రమాదేవి ఒక సామాన్య కార్యకర్త. క్లస్టర్ ఇన్చార్జిగా పనిచేశారు. అయితే గతంలో లోకేష్ పాదయాత్రలో వడ్డెర కులస్తులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించిన రోజే.. ఒక వెనుకబడిన వర్గానికి చెందిన రమాదేవికి ఏకంగా పెద్దల సభలో అవకాశం కల్పించారు. ఇది గొప్ప విషయం కూడా. వెనుకబడిన తరగతులకు ఒక భరోసా కూడా.
* క్వారీ లీజులు సైతం..
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. రాయలసీమ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం అయింది. అయితే అనంతపురం జిల్లాలో వడ్డెర కులస్తులు పడుతున్న బాధలను స్వయంగా తెలుసుకున్నారు లోకేష్. వారితో మమేకమై వారి సమస్యలను తెలుసుకునే క్రమంలో.. తమ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కావాలని కోరారు. ఆపై తమ వృత్తులకు ఒక గౌరవం కల్పించాలని కోరారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి నారా లోకేష్ వారి సమస్యలపై దృష్టి పెట్టారు. వడ్డెర కులస్తులకు మైనింగ్ లీజులు ఇచ్చి ప్రోత్సహించారు. సాధారణంగా ఈ సామాజిక వర్గం వారు రాళ్లు కొట్టడం, భవన నిర్మాణ సామాగ్రిని తయారు చేయడం వంటి పనుల్లో ఉంటారు. అయితే మైనింగ్ లీజులు కల్పించాలని దశాబ్దాలుగా కోరుతూ వచ్చారు. కానీ ఈ ఏడాది మార్చిలో వారి కోరిక తీర్చారు నారా లోకేష్. తమ కులవృత్తి అయిన రాళ్లు కొట్టడం, మట్టి పనులు చేసుకుని జీవించేందుకు ప్రభుత్వ ఆధీనంలోని కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు కల్పించాలని కోరారు వడ్డెర కులస్తులు. ఇచ్చిన మాట ప్రకారం వారికి క్వారీల్లో మైనింగ్ లీజులను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏకంగా 33 శాతం వాటాలు కల్పించారు. వారికి ఆర్థికంగా అండగా నిలిచారు. ఇలా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక, రాజకీయ చేయూత అందించే ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీది మాత్రమే..