Pawankalyan : పవన్ పై కులముద్ర వేసే కుట్ర జరుగుతోందా? దానికి అడ్డుకట్ట వేసే పనిలో ఉన్నారా? అందుకే వారాహి యాత్రలో తరచూ కుల ప్రస్తావన తీసుకొస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విశ్లేషకులు సైతం అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. గత ఎన్నికల్లో కాపులు పవన్ కు కాదని జగన్ కు టర్న్ అయ్యారు. సొంత సామాజికవర్గ నేతకు ఝలక్ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ కాపులకు రిక్తహస్తం చూపారు. దీంతో కాపులు పశ్చాత్తాపం పడ్డారు. అందుకే పవన్ ను ఓన్ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా ఇతర సామాజికవర్గాలను పవన్ కు దూరం చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు.
విపక్షాల కుట్రను పవన్ గుర్తించారు. అందుకే జాగ్రత్తపడుతున్నారు. వారాహి యాత్రలో దీనిపై స్పష్టతనిచ్చారు. తనకు తన కులమంటే అభిమానమేనన్నారు. కానీ ఇతర కులాలను దూరం చేసుకోలేనని చెప్పుకొచ్చారు. సమాజంలో అణగారిన వర్గాలు, అగ్రవర్ణాల్లో నిరుపేదలు..ఇలా అన్ని పక్షాలకు తన అండ ఉంటుందని చెబుతున్నారు. వారికి అన్నివిధాలా చేయూతనిస్తానంటున్నారు. తనపై ఒక కుల ముద్ర వేస్తానంటే ఊరుకోనని.. తాను అందరివాడినని స్పష్టం చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో పొత్తులకు సిద్ధంగా ఉన్నట్టు పవన్ గతంలో ప్రకటించారు. ఇప్పుడు జనసేనను ఓటేయ్యాలని కోరుతున్నారు. తనకు సీఎం గా చాన్స్ ఇవ్వాలని విన్నవిస్తున్నారు. అయితే మారిన స్ట్రాటజీ ప్రత్యర్థులకు అంతుపట్టడం లేదు. పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? దీని వెనుక స్కెచ్ ఏమైనా ఉందా? అన్న చర్చ నడుస్తోంది. అయితే ముందుగా సొంత సామాజికవర్గాన్ని గాడిలో తెచ్చేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తరువాత మిగతా వర్గాలపై ఫోకస్ పెంచుతారని చెబుతున్నారు.
అయితే జనసేనకు ఎక్కువగా అభిమానించేది వెనుకబడిన వర్గాలే. జనసేనతో తమ బతుకులు మారతాయని ఆశించి వారిలో ఆ వర్గమే ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటరుగా ఉండే ఎస్సీ, ఎస్టీలు తరువాత వైసీపీ వైపు టర్న్ అయ్యారు. అయితే జగన్ సర్కారు ఆశించిన స్థాయిలో వారికి ప్రయోజనం చేకూర్చలేదు. అందుకే వారు పునరాలోచనలో పడ్డారు. జనసేన వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో జనసేనపై కాపు కులముద్ర వేసి అడ్డుకట్ట వేయాలని వైసీపీ చూస్తోంది. దానిని గమనించిన పవన్ వారాహి యాత్రలో దీనిపై గట్టిగానే క్లారిటీ ఇస్తున్నారు.