Parakala Prabhakar: రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చి రెండేళ్లు అవుతోంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు సమీపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కూటమి గెలుపును సహించుకోలేకపోతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు అన్నీ చేసిన తరువాత కూడా తాము ఓడిపోయాము అని భావిస్తోంది. ప్రజలు తమ పట్ల విశ్వాసంతో కనిపించారని.. కానీ ఓట్ల విషయంలో ఏదో మోసం జరిగిందన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అనుమానం. ముఖ్యంగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. సగటు వైసీపీ శ్రేణి అనుమానం అదే. ఇప్పటికీ అదే ప్రజాబలం తమకు ఉందని భావిస్తున్నారు. ప్రజాబలం ఊహ వరకు ఓకే కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది మాత్రం చాలా కష్టం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో పరకాల ప్రభాకర్ ఓ వెబ్సైట్ కోసం రాసిన కథనం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తమ అనుమానమే నిజమైనట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తుంది.
* కేవలం వైఫల్యాలపై..
ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఎన్నికల కమిషన్( Election Commission) వైఫల్యాలను ప్రస్తావిస్తూ వచ్చారు పరకాల ప్రభాకర్. ఎన్నికల వ్యవస్థలో లోపాలు ఉన్నాయని చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చిన ఆయన ఏకంగా వ్యాసం రాశారు. ప్రత్యేకంగా ఏపీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావించారు. ఆరోజు ఐదు గంటలకు పోలింగ్ ముగిసింది. అయితే ఐదు గంటలు దాటిన తర్వాత క్యూలైన్లలో ఉన్న వారిని అనుమతించారు ఓటు వేయడానికి. కానీ ఐదు గంటలు పోలింగ్ ముగిసే సమయానికి ఇచ్చిన ఓటింగ్ శాతానికి.. తరువాత రాత్రి 8 గంటలకు.. ఆ తరువాత రాత్రి 11:45 గంటలకు.. చివరకు పోలింగ్ ముగిసే సమయానికి ఇచ్చిన ఓటు శాతంలో చాలా తేడా ఉందన్నది పరకాల ప్రభాకర్ వ్యాసం సారాంశం. సాధారణ పోలింగ్ సమయం ముగిసిన ఐదు గంటల వరకు గంటకు 60 మంది చొప్పున మాత్రమే ఓటు వేయగలిగారని.. కానీ సాయంత్రం ఐదు గంటల తరువాత గంటకు ఓటు వేసే వారి సంఖ్య పెరిగిందని.. దీని వెనుక ఉన్న అర్థం ఏమిటనేది పరకాల తన వ్యాసం ద్వారా ప్రశ్నించారు.
* సమాచార లోపంతో..
అయితే పరకాల( parakala Prabhakar) ఎన్నికల కమిషన్ వైఫల్యాలపై మాట్లాడారే కానీ.. ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి ప్రస్తావించలేదు. సమాచార వైఫల్యంతో ఎన్నికల కమిషన్ ప్రకటనల్లో తేడా ఉండవచ్చు. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరకాల ప్రభాకర్ వ్యాసాన్ని వైరల్ చేస్తోంది. గత రెండు రోజులుగా దీనిపైనే రచ్చ నడుస్తోంది. ఇక్కడ కూడా వైసిపి వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడుతోంది. ఎంతవరకు తమకు బలం ఉంది.. ప్రత్యర్థికి తక్కువ బలం ఉంది.. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అలా చేశారు అంటూ బలంగా నమ్ముతోంది. కానీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు. ఎన్నికల కమిషన్ వైఫల్యాలపై ఎన్నో రకాల అనుమానాలు ఉన్నాయి. అయితే తాము గెలిస్తే సవ్యంగా.. ఎదుటివారు గెలిస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ అంటే మాత్రం కుదరదు. అయితే ఇప్పుడు పరకాల ప్రభాకర్ వ్యాసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆశలు రేపుతోంది.