Nara Lokesh: సాధారణంగా ప్రభుత్వాల పనితీరుపై కొన్ని వర్గాల వారికి సంతృప్తి ఉండదు. ఎంతవరకు తమకు ఏం చేశారు అని ప్రశ్నిస్తుంటారు. ఇతర అంశాలను పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా ఉద్యోగులపై ఈ విమర్శ ఉంది. సమాజంలో ఇతర వర్గాల సంక్షేమం కంటే తమకోసం ప్రభుత్వం ఏం చేసింది అని ఎక్కువగా ఆలోచిస్తారని అపవాదు వారిపై ఉంది. మరోవైపు ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆదరణ ఉంటేనే రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తాయి. ఇది చాలా సందర్భాల్లో చూసాం కూడా. మొన్న ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే సరికి ఆ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే కూటమిపై సైతం ఉద్యోగ, ఉపాధ్యాయుల వ్యతిరేకత ప్రారంభం అయిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితులేవీ కనిపించడం లేదు.
* పూర్తిగా మారిన సీన్..
ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్( Nara Lokesh) వచ్చిన తర్వాత పూర్తిగా ఆ శాఖలో పరిస్థితి మారింది. అటు ప్రజా సంక్షేమంతో పాటు ఉపాధ్యాయుల అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు లోకేష్. విద్యా శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చారు. గతం మాదిరిగా ఎటువంటి వైఫల్యాలకు తావు లేకుండా విద్యా శాఖను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఉపాధ్యాయులను ఎంతగానో ఆకర్షిస్తోంది. తాజాగా ఒక ఘటనపై ఉపాధ్యాయులు ఆనందంతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫోటోలతో పత్రికలకు ప్రకటన ఇవ్వడం పై వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల ఫలితాలని ప్రకటనల రూపంలో ప్రచురించేవారు. కానీ చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ విద్యార్థుల ఫోటోలను ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయం అంటూ ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాహటంగానే నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
* పరిస్థితులను గాడిలో పెడుతూనే..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో విద్యాశాఖలో రోజుకో జీవో.. పూటకు ఒక ఉత్తర్వు వచ్చేది. దీంతో ఉపాధ్యాయ వ్యవస్థలో ఒక రకమైన అయోమయం నెలకొని ఉండేది. ఈ పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్నారు. ఒకవైపు విద్యావ్యవస్థను గాడిలో పెడుతూనే.. బలోపేతానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ వచ్చారు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు అవి సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఉపాధ్యాయుల్లో కూడా లోకేష్ పనితీరు పట్ల సంతృప్తి కనిపిస్తోంది. బాహటంగానే సోషల్ మీడియా వేదికగా ఎక్కువమంది మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో పత్రికల్లో ప్రకటనలు రావడం పై ఎక్కువ మంది ఆనందం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.