spot_img
Home తెలంగాణ Nagunur Temples: నగునూరు.. కేరాఫ్‌ కాకతీయ శిల్పకళా వైభవం

Nagunur Temples: నగునూరు.. కేరాఫ్‌ కాకతీయ శిల్పకళా వైభవం

Nagunur Temples

Nagunur Temples: భారతదేశం అనేక చారిత్రక, పురాతన నిర్మాణాలకు ప్రతీక. వేల ఏళ్ల చాత్రిక నిర్మాణాలు ఇప్పటికీ తవ్వకాల్లో బయటపడుతున్నాయి. మనది వేళ ఏళ్ల చరిత్ర అనేందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక తెలంగాణ ప్రాంతం కూడా కాకతీయుల కళావైభవానికి ప్రతీకగా అనేక ఆలయాలు ఉన్నాయి. కాకతీయులు ఓరుగల్లును రాజధానిగా చేసుకుని పాలన సాగించారు. వీరు అనేక శివాలయాలను నిర్మించారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న నగునూరు గ్రామం, కేవలం ఒక చిన్న పల్లెగా కనిపించినా, దాని నేలలో తెలంగాణ చరిత్రలోని గొప్ప అధ్యాయం దాగి ఉంది. చరిత్రకారులు ఈ ప్రాంతాన్ని నాలుగు వందల ఆలయాల ఊరుగా గుర్తించారు. ఒకప్పుడు కాకతీయుల శిల్పకళా ప్రతిభకు ప్రతీకగా నిలిచిన ఈ గ్రామం, నేడు పరిరక్షణ కోసం ఎదురుచూస్తోంది.

కాకతీయుల ఆధ్యాత్మిక, శిల్ప కేంద్రం
నగునూరు పేరు మూలం నాలుగునోవలు లేదా నాలుగు వందల ఆలయాలు అనే అర్థం నుంచి వచ్చిందని స్థానిక చరిత్ర, శాసనాలు సూచిస్తున్నాయి. 12, 13వ శతాబ్దాలలో కాకతీయ పాలనలో ఈ ప్రాంతం ముఖ్యమైన కోట, ఆలయ సమూహంగా అభివృద్ధి చెందింది. కాకతీయ రుద్రదేవుని కాలంలో ఇక్కడి పాలకుడు వెల్లకి గంగాధరుడు త్రికూటాలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. ఈ త్రికూట ఆలయంలో మూడు శివలింగాలు ఉండటం, కాకతీయుల శైవ భక్తిని, వాస్తు నైపుణ్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

కళ్యాణి చాళుక్యుల శైలి..
కాకతీయులు త్రికూటాలయాలను ఇష్టపడేవారు. నగునూరులోని ఆలయాలు కల్యాణి చాళుక్యుల ప్రభావంతో పాటు కాకతీయ శైలిని కలిపి ఉన్నాయి. ఎర్రని రాతితో నిర్మించిన ఈ నిర్మాణాలు, స్తంభాలపై మృదంగం వాయించే వాద్యకారులు, నర్తకులు, పురాణ దృశ్యాలు వంటి సున్నితమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి. ఇవి కేవలం మతపరమైన కట్టడాలు కాకుండా, అప్పటి సమాజం, కళ, సంగీతం, నృత్య సంప్రదాయాలను ప్రతిబింబించే సాంస్కృతిక దాఖలాలు.

నేలలో దాగిన చరిత్ర..
ఈ గ్రామంలో భూమిపైన కనిపించే ఆలయాలు కొన్ని మాత్రమే. ఇళ్లు కట్టేటప్పుడు, రోడ్లు వేసేటప్పుడు లేదా సాధారణ తవ్వకాల్లో నంది విగ్రహాలు, శిల్ప భాగాలు, ఆలయ అవశేషాలు తరచూ బయటపడుతున్నాయి. కాలక్రమేణా కొన్ని నిర్మాణాలు నేలలోకి కుంగిపోయి ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం కథ కాదు.. స్థానికుల అనుభవాలు, పునరావృతమయ్యే కనుగొన్నలు దీన్ని నిర్ధారిస్తున్నాయి. ఇంతటి శిల్ప సంపద హంపి లాంటి ప్రదేశాలను గుర్తుకు తెస్తుంది. హంపి కూడా ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం వైభవాన్ని ప్రతిబింబించింది. నగునూరు కూడా అదే తరహాలో కాకతీయ యుగం మినీ హంపిగా నిలవగల సామర్థ్యం కలిగి ఉంది. అయితే హంపి యునెస్కో గుర్తింపు, సమగ్ర పరిరక్షణ పొందగా, నగునూరు ఇంకా సరైన శాస్త్రీయ అధ్యయనం, రక్షణ కోసం వేచిచూస్తోంది.

ప్రమాదంలో వారసత్వ సంపద
శతాబ్దాల చరిత్రను మోసుకొచ్చిన నగునూరు శిల్ప సంపద ప్రస్తుతం రెండు రకాల ప్రమాదాల్లో ఉంది. ఒకటి సహజంగా శిథిలమవుతున్నాయి. రెండోది గుప్త నిధుల కోసం రాత్రివేళల్లో జరిగే అనధికార తవ్వకాలు. ఇలాంటి చర్యలు కేవలం పురాతన వస్తువులను దెబ్బతీయడమే కాకుండా, చారిత్రక సందర్భాన్ని శాశ్వతంగా కోల్పోయేలా చేస్తాయి. ఒకసారి స్థానం నుంచి తొలగించిన శిల్పం లేదా నిర్మాణ భాగం, దాని అసలు చారిత్రక విలువను కోల్పోతుంది. ఆలయ గంటల నాదాలతో ఒకప్పుడు మార్మోగిన ఈ ప్రాంతం నేడు నిశ్శబ్దంగా మారింది. స్థానికులు ఈ వారసత్వాన్ని గుర్తించినా, సంస్థాగత మద్దతు లేకపోవడంతో రక్షణ కష్టమవుతోంది. నగునూరు నేలలో ఇంకా ఎన్ని ఆలయాలు, శిల్పాలు దాగి ఉన్నాయో తెలుసుకోవాలంటే శాస్త్రీయ పురావస్తు సర్వే అవసరం. ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా లేదా తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖ సమగ్ర అధ్యయనం చేసి, ముఖ్యమైన ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించాలి.

నగునూరు కేవలం పాత రాళ్ల సమూహం కాదు. ఇది కాకతీయుల కళా ప్రతిభ, ఆధ్యాత్మిక జీవన విధానం, సామాజిక వ్యవస్థకు సజీవ సాక్ష్యం. ఇక్కడి నేలలో ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయి? ఈ శిల్పాలు మనకు ఇంకా ఏమి చెప్పగలవు తెలిస్తే తెలంగాణ చరిత్రలో మరో అధ్యాయం వెలుగులోకి వస్తుంది.

Exit mobile version