AP Students : సర్కారు బడి నుంచి.. అంతర్జాతీయ స్థాయికి.. ఏపీ విద్యార్థులు సాధించిన ఘనత ఇదీ

ఇక ఏపీ విద్యార్థులు రికార్డు స్థాయిలో టోఫెల్ పరీక్షకు హాజరవుతున్న తీరు పట్ల ప్రఖ్యాత జాతీయ మీడియా ఎన్డిటీవీ ఛానల్ సైతం ప్రత్యేక కథనాన్ని రూపొందించింది. ప్రభుత్వం విద్యా విధానం పట్ల చూపించిన చొరవతోనే ఈ స్థాయి ఫలితం సాధ్యమైందని ఆ ఛానల్ కితాబిచ్చింది.

Written By: NARESH, Updated On : April 11, 2024 9:27 pm

AP Students

Follow us on

AP Students : పెచ్చులూడిన స్లాబ్.. ఎప్పుడు కూలుతాయో తెలియని గోడలు.. సమయానికి రాని ఉపాధ్యాయులు.. ఉడికీ ఉడకని మధ్యాహ్న భోజనం.. సక్రమంగా అందని పాఠ్యపుస్తకాలు.. కూర్చోడానికి కానరాని బల్లలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అసౌకర్యాలు.. ఒకప్పుడు ప్రభుత్వ బడి అంటే ఇవే గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు అధునాతన గదులు.. అద్భుతమైన బల్లాలు.. విద్యార్థులకు సక్రమంగా అందుతున్న పాఠ్యపుస్తకాలు.. దుస్తులు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, వేసుకునేందుకు షూస్.. చదువుకునేందుకు డిజిటల్ బోర్డులు..ట్యాబ్ లు.. సక్రమంగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు.. ఐదేళ్లలో చోటు చేసుకున్న ఈ మార్పులతో.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకను రెపరెపలాడిస్తున్నారు. మారుమూలల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని.. ప్రభుత్వ తోడ్పాటుతో అంతర్జాతీయ స్థాయిలో టోఫెల్ పరీక్షకు హాజరవుతున్నారు.

గత ఐదేళ్లలో ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడంతో పేద విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో చదివేందుకు అవకాశం ఏర్పడింది. కేవలం విద్యాబోధన మాత్రమే కాకుండా టోఫెల్ పరీక్షలో విద్యార్థులకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. ఫలితంగా పేద కుటుంబాలలో జన్మించిన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. అంతర్జాతీయ వేదికలు, ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు సత్తా చాటుతున్నారు. ఇదే క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో టోఫెల్ పరీక్షకు 13,104 ప్రభుత్వ పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులు చదువుతున్న 4,53,265 మంది పేద విద్యార్థులు హాజరయ్యారు. దీని తర్వాత స్థాయిలో నిర్వహించే పరీక్ష సైతం 5,907 స్కూళ్ల కు చెందిన 6,7,8,9 తరగతుల విద్యార్థులు హాజరవనున్నారు. ఇక ఏప్రిల్ 12న నిర్వహించే పరీక్షకు 16.5 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. ఈ ఐదేళ్లలో ప్రభుత్వం విద్యా విధానం పటిష్టతకు చేపట్టిన కేటాయింపులు, ప్రభుత్వ పాఠశాలల బాగుకోసం చూపించిన తోడ్పాటు, విద్యా దీవెన వంటి పథకాలు పేద విద్యార్థుల జీవితాల్లో సమూల మార్పులకు కారణమయ్యాయని మాజీ విద్యావేత్తలు అంటున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లల్ని సక్రమంగా పాఠశాలలకు పంపిస్తుండడంతో ఒక్కసారిగా ప్రభుత్వ విద్యా విధానంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు.

టోఫెల్ లాంటి పరీక్ష మాత్రమే కాకుండా విద్యార్థులో విషయ పరిజ్ఞానం పెంపు మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సిలబస్ కూడా మార్చింది. బ్లాక్ బోర్డ్, చాక్ పీస్ కాకుండా పూర్తిగా డిజిటల్ విధానంలోకి ప్రభుత్వ విద్యా విధానాన్ని మళ్ళించింది. ఫలితంగా విద్యార్థులు అన్ని విషయాల్లో పరిజ్ఞానాన్ని పొందడం ప్రారంభించారు. అందువల్లేవారు ఆంగ్లంలో అనర్ఘళంగా మాట్లాడుతున్నారు. ఇక ఏపీ విద్యార్థులు రికార్డు స్థాయిలో టోఫెల్ పరీక్షకు హాజరవుతున్న తీరు పట్ల ప్రఖ్యాత జాతీయ మీడియా ఎన్డిటీవీ ఛానల్ సైతం ప్రత్యేక కథనాన్ని రూపొందించింది. ప్రభుత్వం విద్యా విధానం పట్ల చూపించిన చొరవతోనే ఈ స్థాయి ఫలితం సాధ్యమైందని ఆ ఛానల్ కితాబిచ్చింది.