Monsoon Rains Andhra Pradesh: రాష్ట్రంలో వాతావరణం లో మార్పులు సంభవించాయి. ఇప్పటివరకు వేడి వాతావరణం కొనసాగుతుండగా.. అకస్మాత్తుగా మేఘావృతం అవుతుంది. వర్షానికి తగ్గట్టు వాతావరణం మారుతోంది. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణీ కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే భీకర గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. పలు జిల్లాలను అప్రమత్తం చేసింది. చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తాజా బులిటెన్ లో వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులు కూడా వీచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది విపత్తుల నిర్వహణ సంస్థ.
* చురుగ్గా కదులుతున్న వైనం..
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. అయితే రుతుపవనాలు చురుగ్గా ఉన్న క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణి కారణంగా ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ఈదురు గాలుల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. గాలుల తీవ్రత కూడా అధికంగా ఉండనుంది. పోలవరం,అనకాపల్లి, కాకినాడ,పల్నాడు, మార్కాపురం,ప్రకాశం, నెల్లూరు జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి.
* భారీ వర్షం నమోదు..
ఏపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు నమోదయ్యాయి. విజయవాడ నగరంలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. గాలివాన బీభత్సం సృష్టించింది. విద్యుత్ సరఫరా లో కూడా అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది. మరోవైపు నైరుతి రుతుపవనాల చురుగ్గా కదులుతుండడంతో.. వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాలేదు ఏపీలో. దీంతో ఖరీఫ్ ఫై ఆందోళన కనిపిస్తోంది రైతుల్లో.

