Mangalagiri Crime News: ఏపీలో( Andhra Pradesh) విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నేరాలు విభిన్న రీతిలో జరుగుతున్నాయి. టీవీ సౌండ్ తగ్గించమన్న మాటకు తీవ్ర ఆగ్రహానికి గురైంది ఆమె. భర్తను దారుణంగా హత్య చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ దారుణం జరిగింది. దంపతుల మధ్య చోటు చేసుకున్న చిన్న కుటుంబ వివాదం క్షణాల్లోనే ఘర్షణగా మారి.. ఒకరి ప్రాణాలను బలిగొంది. స్థానికంగా సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మంగళగిరిలో ఘటన.. మంగళగిరి( Mangalagiri) టిడ్కో జిల్లా సముదాయంలో ఓ ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భర్తను కత్తితో పొడిచి హతమార్చే దాకా పరిస్థితి వెళ్ళింది. కేవలం ఇంట్లో ఉన్న టీవీ సౌండ్ తగ్గించాలని భర్త అహ్మద్ కోరడంతో.. దంపతులిద్దరి మధ్య వివాదం మొదలైంది. చిన్నపాటి గొడవ చినికి చినికిచినికి గాలి వానలో మారింది. గొడవ తీవ్రతరమైంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య క్రాంతి వంట గదిలో ఉన్న కత్తిని తీసుకువచ్చి అహమ్మద్ ను పొడిచింది. కుప్ప కూలిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు..
ఏడాది కిందట ప్రేమ వివాహం..
అయితే అహమ్మద్, క్రాంతిలది ప్రేమ వివాహం. మతాంతర వివాహం అని కూడా స్థానికులు చెబుతున్నారు. ఏడాది కిందట వీరు వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొదట్లో చాలా అన్యోన్యంగా గడిపే వారట. కానీ ఇటీవల కాలంలో మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. అయితే ఇద్దరి మధ్య పెద్ద పెద్ద గొడవలు లేవని.. కుటుంబ కలహాలు కూడా తక్కువేనని స్థానికులు చెబుతున్నారు. క్షణికావేశంలో జరిగిందా? లేకుంటే వెనుక బలమైన కారణాలు ఉన్నాయా? అన్నది తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే టీవీ సౌండ్ తగ్గించమన్న పాపానికి ఏకంగా భర్తను లేపేయడం ఆందోళన కలిగిస్తోంది.